మహారాణిపేట: మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతలను అక్షయపాత్ర సంస్థకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్లోని పీజేఆర్ఎస్లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పి.మణి మీడియాతో మాట్లాడుతూ.. అక్షయపాత్రకు పథకాన్ని అప్పగిస్తే ఏళ్ల తరబడి నమ్ముకున్న కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్మికుల ఉపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు. జనవరి నెల నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని, పెరిగిన ధరల దృష్ట్యా ప్రభుత్వమే నేరుగా గ్యాస్ సరఫరా చేయాలని కోరారు. యూనియన్ జిల్లా కార్యదర్శి జి.మంగశ్రీ, అధ్యక్షురాలు భవాని, కార్మికులు పాల్గొన్నారు.


