సింహాచలం: వరాహ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు అధికారులను ఆదేశించారు. సోమవారం దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం, వైదికులు, వివిధ విభాగాల సెక్షన్ హెడ్లతో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై ఆయన ముందస్తు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జూలై 28న 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ, 29న కొండపై ఆలయ ప్రదక్షిణలు జరుగుతాయని వెల్లడించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడ తాగునీరు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు, తాత్కాలిక షెడ్లు, వైద్య శిబిరాలు, మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. మార్గంలో ఏయే ప్రదేశాల్లో ఏ సౌకర్యాలు అవసరమో క్షేత్రస్థాయిలో గుర్తించి, ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. బారికేడ్ల ఏర్పాటు, విద్యుద్దీకరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో దేవస్థానం ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, డిప్యూటీ కలెక్టర్ మధులత, డిప్యూటీ ఈవో రాధ, ఈఈ రాంబాబు, ఏఈ రవిరాజు, ఏఈవోలు రమణమూర్తి, పిల్లా శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.


