పీఎంపాలెం: పీఎం పాలెం శిల్పారామం వేదికగా ఆదివారం సాయంత్రం జానపద కళల కోలాహలం నెలకొంది. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ ప్రదర్శనలో భక్తి, జానపద బాణీలు శిల్పారామం ప్రాంగణంలో మారుమోగాయి. నగరానికి చెందిన శ్రీ శివసాయి కోలాటం గ్రూపు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన అట్టహాసంగా సాగింది. కార్యక్రమం తొలుత శ్రీరాముని కీర్తిస్తూ సాగే ‘రఘుకుల తిలకా రారా’.. అనే భక్తి గీతంతో ప్రారంభమైంది. మహిళా కళాకారులు లయబద్ధంగా కోలాటం ఆడుతూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అనంతరం ‘రావు రావు తల్లీ..’, గోపికలు ఏమయినారు.., రంగని కళ్యాణం, శివశివ మూర్తి ఘననాధ.. వంటి కీర్తనలకు జానపద శైలిలో ప్రదర్శించిన కోలాట రీతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారులు కళ్యాణి, శ్రావణి, నీహారిక, మహాలక్ష్మి, వర్షిణి, శిరీష, మేఘన, జ్యోతి తదితరులు తమ నైపుణ్యంతో అలరించారు.


