వేసవి సెలవులు, దానికి తోడు ఆదివారం కావడంతో జూ పార్కు సందర్శకుల తో కళకళలాడింది. ఎండను సైతం లెక్కచేయకుండా నగరవాసులు తమ కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి వన్యప్రాణులను వీక్షించేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. కొందరు గొడుగులు చేతబట్టి తిరగగా, మరికొందరు నడుస్తూ.. చెట్ల కింద సేదతీరుతూ జంతువులను, పక్షులను ఆసక్తిగా తిలకించారు. ఓ చిన్నారి మూడు చక్రాల సైకిల్పై జూలో విహరిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించింది. మరోవైపు భానుడి ప్రతాపానికి వన్యప్రాణులు సైతం విలవిల్లాడాయి. ఎండ వేడికి తట్టుకోలేక చాలా జంతువులు చెట్ల నీడకేపరిమితమయ్యాయి. గజరాజులు నీటి కొలనును వదలకుండా జలకాలాటలాడుతూ కనువిందు చేశాయి. చింపాంజీలు, కోతులు, కనుజులు, నీల్గైస్ ఎన్క్లోజర్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాటాకు పందిళ్ల కింద.. నెమళ్లు, నల్ల హంసలు నీటి స్ప్రింక్లర్ల వద్ద సేదదీరాయి. జిరాఫీలు, జీబ్రాలు చెట్ల నీడను ఆశ్రయించాయి.
– ఆరిలోవ/సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


