పెందుర్తి: పెందుర్తిలో తలపెట్టిన ఒక బాల్య వివాహానికి పోలీసులు అడ్డుకట్ట వేశారు. వివరాలివి. స్థానిక రాచ్చెరువు ప్రాంతంలోని ఒక కల్యాణ మండపంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై స్పందించిన సీఐ కె.వి.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐలు ఎన్వీ భాస్కరరావు, స్వామినాయుడు తమ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. వివాహ వేదిక వద్ద బాలిక కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సరైన వయసు రాకుండా వివాహం చేయడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను, చట్టపరమైన ఇబ్బందులను వారికి వివరించారు. అనంతరం బాలల సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించి, వివాహాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే తక్షణమే 1098 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.


