మహారాణిపేట: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమన్వయ సమీక్షా సమావేశంలో ఆమె పలు కీలక సూచనలు చేశారు. ఈనెల 21 నుంచి జూన్ 2 వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం జిల్లాలో మొత్తం 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, లైటింగ్, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థుల రాకపోకలకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.


