బాస్కెట్బాల్లో సత్తా చాటుతున్న
క్రీడాకారులు
జాతీయస్థాయిలో రాణిస్తున్న
యువకిశోరాలు
రీల్స్కు గుడ్ బై.. రింగులోకి
దూకుదాం రండి!
క్రీడలు మానసిక ఉల్లాసానికే కాకుండా శారీరక దృఢత్వానికి ఎంతో తోడ్పడతాయి. అయితే నేటి తరం యువత సెల్ ఫోన్లకు బందీలుగా మారుతోంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా రీల్స్, ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో గడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. దీని వల్ల అలసత్వం, మతిమరుపు, కంటి సమస్యలు వంటి అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. దీనిని గమనించిన పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు వేదికగా నిలుస్తోంది సాగర్నగర్ బాస్కెట్బాల్ అకాడమీ(ఎస్ఎన్బీఏ). సాగర్నగర్కు చెందిన విద్యార్థులు ఒకవైపు చదువులో రాణిస్తూనే, మరోవైపు క్రీడల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పలు పోటీల్లో ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 2018లో ప్రారంభమైన ఈ అకాడమీలో, కోచ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన సుమారు 300 మందిలో, ఇప్పటివరకు 20 మంది జాతీయ స్థాయిలో, 30 మంది రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించడం విశేషం. భవిష్యత్లో మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించడమే తమ లక్ష్యమని విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
సాగర్నగర్ బాస్కెట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో సాగర్నగర్ గ్రౌండ్లో ఇప్పటికే సమ్మర్ క్యాంప్ ప్రారంభమైంది. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 8.30 వరకు, తిరిగి సాయంత్రం 6 నుంచి 8 వరకు శిక్షణ ఇస్తున్నారు. కనీసం 10 ఏళ్ల వయసు పైబడిన వారు శిక్షణకు అర్హులు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోచ్ సూచించారు.
దేశం తరఫున ఆడటమే నా కల
ఇటీవల డెహ్రాడూన్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం కఠోర సాధన చేస్తున్నాను. ఏదో ఒక రోజు భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, దేశం గర్వపడేలా చేయడమే నా జీవిత లక్ష్యం.
– ఎన్. నవ్య, క్రీడాకారిణి
దేశానికి కెప్టెన్గా వ్యవహరించాలి
గతేడాది డెహ్రాడూన్ జాతీయ పోటీల్లో ఏపీ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప అనుభవం. భవిష్యత్తులో మరింత శ్రమించి, భారత బాస్కెట్ బాల్ జట్టుకు నాయకత్వం వహించాలనేది నా బలమైన ఆశయం. – వి.వి.వాట్సన్
మెరుపు వేగంతో సాగే క్రీడ బాస్కెట్బాల్. ఇటువంటి క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించాలంటే కఠోర సాధన, శ్రమ ఎంతో అవసరం. వాటన్నింటినీ అధిగమించి, జాతీయ స్థాయిలో తమ ముద్ర వేస్తున్నారు సాగర్నగర్ క్రీడాకారులు. ఇటీవల డెహ్రాడూన్ వంటి నగరాల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన నవ్య, వాట్సన్ వంటి క్రీడాకారులు ఇక్కడ శిక్షణ పొందిన వారే.. ప్రతి ఏటా సమ్మర్ క్యాంప్ ద్వారా ఉచితంగా శిక్షణ పొందుతూ.. చాంపియన్లుగా మారుతున్నారు. – కొమ్మాది
గొప్ప క్రీడాకారుడిగా ఎదగడమే లక్ష్యం
బాస్కెట్ బాల్ నాకు క్రమశిక్షణను నేర్పింది. జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, అత్యుత్తమ క్రీడాకారుడిగా పేరు తెచ్చుకోవడమే నా టార్గెట్. అందుకే నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నాను.
– నీల్, క్రీడాకారుడు


