బీచ్రోడ్డు : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి అపార్ట్మెంట్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన మీసాల సత్యనారాయణ (39) తీవ్రమైన మద్యపాన వ్యసనంతో బాధపడుతుండేవాడు. దీని నుంచి అతడిని విముక్తి కలిగించేందుకు కుటుంబ సభ్యులు నగరంలోని మానసిక ఆసుపత్రిలోని డి–ఎడిక్షన్ సెంటర్లో చేర్పించారు. శుక్రవారం ఆసుపత్రి సమీపంలోని ఒక అపార్ట్మెంట్పైకి వెళ్లిన సత్యనారాయణ, అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతుడికి 2016లో చంద్రకళతో వివాహం కాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం మత్తులో భార్యను ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మూడేళ్లుగా సత్యనారాయణ తన తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆయా తేదీలలో పలు రైళ్ల రీ షెడ్యూల్
తాటిచెట్లపాలెం: సౌత్ ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని రూప్స స్టేషన్లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ మార్గంలో నడిచే పలు కీలక రైళ్లను రీషెడ్యూల్ చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. పవన్కుమార్ వెల్లడించారు. ఈ మార్పుల ప్రకారం హౌరా–సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12703) ఈ నెల 11, 12, 13 తేదీలలో రెండు గంటలు, 14న గంట, 15న గంటన్నర, 17న నాలుగు గంటల ఆలస్యంగా హౌరా నుంచి బయల్దేరనుంది. అదేవిధంగా సికింద్రాబాద్–హౌరా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12704) ఈ నెల 15న గంట, 16న రెండు గంటల ఆలస్యంగా సికింద్రాబాద్ నుంచి బయల్దేరనుంది. వీటితో పాటు న్యూ జల్పయ్గురి–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 15న గంట ఆలస్యంగా, హౌరా–ఎస్ఎంవీటీ బెంగళూరు దురంతో ఎక్స్ప్రెస్ 16న గంట, 17న రెండు గంటల ఆలస్యంగా హౌరా నుంచి బయల్దేరనున్నాయి.


