విశాఖ సిటీ: విశాఖ జిల్లాలో కొత్తగా ఐదు అదనపు కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర న్యాయ, శాసనసభ వ్యవహారాల శాఖ కార్యదర్శి గొట్టపు ప్రతిభా దేవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ కేంద్రంగా 14, 15వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టులను మంజూరు చేశారు. నగరంలో కుటుంబ వివాదాల పరిష్కారం కోసం 2వ అదనపు ఫ్యామిలీ కోర్టు–కమ్–అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, అలాగే 3వ అదనపు ఫ్యామిలీ కోర్టు–కమ్–అదనపు జిల్లా సెషన్స్ కోర్టులను ప్రభుత్వం నోటిఫై చేసింది. పారిశ్రామిక కేంద్రంగా ఉన్న గాజువాకలో ప్రత్యేకంగా ఒక ఫ్యామిలీ కోర్టు–కమ్–అదనపు జిల్లా సెషన్స్ కోర్టును ఏర్పాటు చేశారు. నర్సీపట్నంలో కూడా ఒక అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టు అందుబాటులోకి రానుంది.


