మహారాణిపేట: కేజీహెచ్లోని వెంటిలేటర్ల స్థితిగతులపై బుధవారం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన ‘శ్వాసకు బ్రేక్.. వెంటిలేటర్ల షాక్’ కథనానికి ఆస్పత్రి యంత్రాంగం స్పందించింది. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి వివరణ ఇస్తూ.. కేజీహెచ్లో మొత్తం 379 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిలో ప్రస్తుతం 158 వెంటిలేటర్లు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయని, మిగిలిన 221 వెంటిలేటర్లు చిన్నపాటి మరమ్మతులకు గురయ్యాయని ఆమె పేర్కొన్నారు. మరమ్మతులకు గురైన వెంటిలేటర్లను రిపేరు చేయించి, త్వరలోనే రోగులకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వారం రోజుల్లో ఎన్హెచ్ఎం ఉద్యోగులకు జీతాలు
మహారాణిపేట: వైద్యారోగ్య శాఖలో ‘నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం)’కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వారం రోజుల్లోగా జీతాలు అందుతాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి. జగదీశ్వరరావు తెలిపారు. బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘ప్లీజ్.. జీతాలు ఇవ్వండి’అనే వార్తకు డీఎంహెచ్వో స్పందించారు. ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఉద్యోగులు జీతాల గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


