సీతంపేట: ప్రముఖ జర్నలిస్టు, రచయిత తాడి ప్రకాష్ ఈ ఏడాది చందు సుబ్బారావు లిటరరీ ట్రస్ట్ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఈ మేరకు ఆచార్య చందు సుబ్బారావు లిటరరీ అండ్ కల్చరల్ ట్రస్ట్ చైర్మన్ పూర్వ యూపీఏసీ సభ్యుడు ఆచార్య కేఎస్ చలం, కార్యదర్శి ఉప్పల అప్పలరాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. చందు 80వ జయంతి సందర్భంగా ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టు జ్ఞాపకాలతో తాడి ప్రకాష్ రాసిన ‘ఏలూరు రోడ్డు–ఆత్మ గీతం’పుస్తకం అందరి మన్ననలు పొందిందన్నారు. ఈ సభకు జర్నలిస్టులు, రచయితలు, కవులు హాజరుకావాలని ప్రొఫెసర్ చలం, ఉప్పల అప్పలరాజులు కోరారు.


