మహారాణిపేట: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) కేజీహెచ్ బ్రాంచ్ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్సార్) కింద కేజీహెచ్కు రూ.8 లక్షల 34 వేల 570ల విలువ గల 5 బాయిల్స్ ఆపరేటస్, 15 సెక్షన్ ఆపరేటస్ పరికరాలను విరాళంగా అందించింది. ఈ పరికరాల మంజూరు పత్రాలను యూనియన్ బ్యాంక్ కేజీహెచ్ బ్రాంచ్ మేనేజర్ ఎంవీ శ్రీనివాస్, జోనల్ హెడ్ సోనాలిక, డిప్యూటీ రీజనల్ హెడ్ బీటీ శ్రీనివాస్, రీజనల్ హెడ్ జె.సింహాచలం తదితరులు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణికి అందించారు. వీటిని రోగులకు మత్తు ఇచ్చేందుకు, క్రిటికల్ కేర్, వెంటిలేటర్ మీదున్న రోగులకు అత్యవసర పరిస్ధితుల్లో ప్రాణాలు కాపాడేందుకు, ఆపరేషన్ సమయాల్లో వినియోగిస్తారని అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ కె.శ్రీలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో డీసీఆర్ఎంవో డాక్టర్ ఆర్వీఎస్ కుమార్, ఆర్ఎంవోలు డాక్టర్ ఎ.రాజేష్, డాక్టర్ బంగారయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ బి.ఎస్.సుమతి పాల్గొన్నారు.


