కొమ్మాది: సాగర్నగర్ బీచ్రోడ్డులో మంగళవారం తీవ్రమైన ఎండ వేడిమికి తాళలేక ఒక వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. భీమిలికి చెందిన రేగాని రాంబాబు (58) ఇసుక తోటలో టైలరింగ్ షాపు నిర్వహిస్తున్నారు. ఆయన తన పనుల నిమిత్తం భీమిలి నుంచి బస్సులో బయలుదేరగా, మార్గమధ్యలో ఎండ తీవ్రతకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సాగర్నగర్ సమీపంలో బస్సు దిగిన ఆయన, ఒక్కసారిగా స్పృహ తప్పి బస్టాపులోనే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా, వారు వచ్చి పరీక్షించి అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు.


