మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులను గడువులోగా పరిష్కరించాలని, ప్రజలకు సత్వర న్యాయం చేయడమే అధికారుల ప్రథమ కర్తవ్యమని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వీసు సంబంధిత వినతుల కోసం ప్రత్యేక ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. పరిష్కరించిన ఫిర్యా దులు మళ్లీ రీ–ఓపెన్ కాకూడదని ఆదేశించారు. ముఖ్యంగా సీఎం కార్యాలయం నుంచి బదిలీ అయ్యే ఫిర్యాదులను డీఆర్వో ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ప్రజలు ఇచ్చే వినతుల నమోదుకు ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహించాలని, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్కు మొత్తం 354 వినతులు వచ్చాయి.


