తగరపువలస: ఎండలు మండుతున్న తరుణంలో కురిసిన అకాల వర్షాలు ఉప్పు రైతులకు కష్టాలను తెచ్చిపెట్టాయి. భీమిలి మండలం కొత్త మూలకుద్దు పంచాయతీ పరిధిలోని 99 ఎకరాల్లో సాగవుతున్న ఉప్పు మళ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు సాగే ఈ సాగులో, మేలో వచ్చే దిగుబడి అత్యంత కీలకం. అయితే ఈ నెల ఒకటో తేదీన కురిసిన భారీ వర్షానికి మళ్లన్నీ నీట మునిగి సాగుకు పనికిరాకుండా పోయాయి. ఆదివారం కూడా వాతావరణం చల్లబడటంతో రైతులు సాగుకు విరామం ప్రకటించారు. సిద్ధంగా ఉన్న ఉప్పు రాశులు తడవకుండా పరదాలు కప్పి భద్రపరుస్తున్నారు. మరోవైపు గ్రామంలో సుత్తమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం కావడంతో రైతులు పనులకు స్వస్తి చెప్పారు. ఈ నెల 6న పండగ ముగిసిన తర్వాత ఎండలు కాస్తేనే మళ్లీ సాగును పునఃప్రారంభించే అవకాశం ఉందని కౌలు రైతులు వెల్లడించారు.


