సాక్షి, విశాఖపట్నం: గత కొద్ది రోజులుగా నిప్పులు చెరుగుతున్న భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరైన విశాఖ నగరానికి ఎట్టకేలకు వరుణుడు ఊరటనిచ్చాడు. శుక్రవారం సూర్యోదయం నుంచే ఆకాశం మేఘావృతమై, భానుడు దోబూచులాడుతుండటంతో నగరవాసులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించింది. ఉదయం నుంచే నగరాన్ని పలకరించిన చల్లని గాలులు, వెనువెంటనే కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారింది. వర్షపు జల్లులతో రోడ్లన్నీ తడిసి ముద్దవ్వగా, అప్పటివరకు సెగలు కక్కుతున్న రహదారుల వేడి తగ్గింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో సముద్రపు గాలులు భూభాగం వైపు మళ్లడమే ఈ వాతావరణ మార్పునకు ప్రధాన కారణమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గవచ్చని, నేడు కూడా నగరంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మండుతున్న ఎండలతో అల్లాడిపోతున్న సామాన్య జనానికి, ముఖ్యంగా పాదచారులు, వాహనదారులకు ఈ చిరుజల్లులు అమృతధారల్లా అనిపించాయి. సాయంత్రం వేళకు సముద్ర తీరం చల్లని గాలులతో మరింత సందడిగా మారింది.
ప్రాంతం కురిసిన
వర్షపాతం(మిమీల్లో)
ఆనందపురం 51.5
కణమాం 40.5
పరదేశీపాలెం 33.5
పద్మనాభం 30.5
వేపగుంట 25.5
మధురవాడ 22.0
సుజాతనగర్ 19.25
పెందుర్తి 19.0
కాపులుప్పాడ 16.5
అక్కిరెడ్డిపాలెం 14.0
జగదాంబ 12.25
ఎండాడ 12.25
ఆరిలోవ 11.75
మహరాణిపేట 10.25
సింహాచలం 9.75
సీతమ్మధార 9.75


