
నీటికి కటకట
సమ్మె తాత్కాలిక విరమణ
● 2వ తేదీ వరకు డెడ్లైన్ విధించిన కార్మికులు ● లేదంటే 3వ తేదీ నుంచి సమ్మె ● మేయర్తో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ చర్చలు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ తాగునీటి విభాగం ఔట్సోర్సింగ్ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమించారు. మేయర్ పీలా శ్రీనివాసరావుతో యూనియన్ నాయకులు జరిపిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల జీతాల పెంపు విషయమై బుధవారం లోపల పరిష్కరించేందుకు మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు కార్మికులు సమ్మెను తాత్కాలికంగా విరమించినట్టు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం.ఆనందరావు సాక్షికి తెలిపారు. బుధవారంలోపు ( వచ్చే నెల 2వ తేదీ) హామీ అమలు కాకపోతే 3వ తేదీ నుంచి తిరిగి సమ్మె బాట తప్పదని ఆయన స్పష్టం చేశారు. పెందుర్తిలోని తన క్యాంప్ కార్యాలయంలో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ నాయకులతో మేయర్ చర్చలు జరిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 50 శాతం తాగునీటి సరఫరా చేయగా, మిగిలిన 50 శాతం సాయంత్రానికి పూర్తిగా పునరుద్ధరించినట్టు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం ప్రజలకు తాగునీటి సరఫరా నిరంతరం కొనసాగేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేప ట్టారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సిటీ ఆపరేషన్ సెంటర్లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు తమ సమస్యల కోసం హెల్ప్లైన్ నెంబరు 0891–2507225ను సంప్రదించవచ్చన్నారు.
చుక్క నీటి కోసం తాపత్రయం
నీరు దొరక్క దిగాలుగా...
జీవీఎంసీ తాగునీటి విభాగం ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మెతో నగరంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. రెండు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బిందెలతో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.‘గుక్కెడు నీరివ్వలేని వారు పాలన ఎలా సాగించగలరు?’ అంటూ జీవీఎంసీ 7వ వార్డులోని వాంబేకాలనీ, 6వ వార్డులోని పీఎం పాలెం జేఎన్ఎన్యూఆర్ఎం బీ–2 కాలనీ, వైఎస్సార్ కాలనీ, వాంబేకాలనీల్లో మహిళలు బిందెలతో నిరసన తెలిపారు. మంచి నీరు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్ని వార్డుల్లో ప్రజలు బోరు బావుల వద్ద బారులు తీరారు. ఆరిలోవ కొండవాలు ప్రాంతాలైన దీన్దయాల్పురం, చినగదిలి, పెదగదిలి, సంజయ్గాంధీ కాలనీ, హనుమంతవాక, ఆదర్శనగర్, బీసీ కాలనీ, సింహగిరి కాలనీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మున్సిపల్ నీరు అందక, బోర్లు పనిచేయక దైనందిన కార్యకలాపాలకు కూడా నీరు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. తాగునీటి కోసం ప్రజలు బోరింగ్లను ఆశ్రయించాల్సి వచ్చింది. –ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం

నీటికి కటకట

నీటికి కటకట

నీటికి కటకట

నీటికి కటకట