
విదేశాల్లో పూర్వ విద్యార్థుల సంఘాలు
● ఎగ్జిట్ ఎంగేజ్మెంట్ ఈవినింగ్ కార్యక్రమంలో ఏయూ వీసీ రాజశేఖర్
మద్దిలపాలెం: విదేశాలలో ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఏయూ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ ప్రకటించారు. శనివారం బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్), ఆంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘ఎగ్జిట్ ఎంగేజ్మెంట్ ఈవినింగ్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశీ విద్యార్థులతో ఏయూ ప్రయాణం విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిందని అన్నారు. ఏయూ పూర్వ విద్యార్థులుగా విదేశాల్లో విశ్వవిద్యాలయం ఖ్యాతిని పెంచే విధంగా పనిచేయాలని ఆయన సూచించారు. విదేశీ విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఐసీసీఆర్ స్కాలర్షిప్ విభాగం డైరెక్టర్ సంజీవ్ వేది మాట్లాడుతూ, ఏయూలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు తమతో పాటు భారతీయతను తీసుకువెళుతున్నారని అన్నారు. ఐసీసీఆర్ అందించే స్కాలర్షిప్ల గురించి ఇతర దేశాల్లోని విద్యార్థులకు వివరించి, మరింత మందికి ఉపయోగపడాలని సూచించారు. ఏయూ అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల విభాగం డీన్, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయరావు మాట్లాడుతూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 59 దేశాల నుంచి 1,100 మందికి పైగా విదేశీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నా రని తెలిపారు. వారికి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు ఏయూతో తమ అనుబంధాన్ని, విశాఖ నగరం, తెలుగు ప్రజల అభిమానాన్ని గుర్తు చేసుకుంటూ తమ అనుభూతులను పంచుకున్నారు. అనంతరం వారికి అల్యూమ్ని కార్డులు అందజేశారు. వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు తమ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఐసీసీఆర్ జోనల్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల విభాగం అసోసియేట్ డీన్ ఆచార్య ఎన్.ఎం. యుగంధర్ ప్రిన్సిపాల్స్ ఆచార్య ఏ. నరసింహారావు, ఎంవీఆర్ రాజు, జి. గిరిజ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

విదేశాల్లో పూర్వ విద్యార్థుల సంఘాలు

విదేశాల్లో పూర్వ విద్యార్థుల సంఘాలు