
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి
సీతంపేట: జీవీఎంసీ తాగునీటి విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె వల్ల నగరంలో తలెత్తుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కే.కే. రాజు ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులు వేతనాల పెంపు కోరుతూ ఎప్పటికప్పుడు సమ్మెలు చేయడం వల్ల నగరంలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. రెండు రోజులుగా విశాఖ ప్రజలు, ముఖ్యంగా కొండవాలు ప్రాంతాల వారు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని, ప్రజలు తాగునీటి కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా పర్మినెంట్ ఉద్యోగులతో నీటి సరఫరాను చేపట్టాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.