
కేజీహెచ్లో ఓపెన్ హార్ట్ సర్జరీ సేవలు బంద్
● మూలనపడ్డ సీపీబీ(కార్డియాలజీ– ఫల్మనరీ బైపాస్) మిషన్ ● వైఎస్సార్సీపీ హయాంలో నిరంతరాయంగా ఓపెన్ హార్ట్ సర్జరీలు
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్లో గుండె (ఓపెన్ హార్ట్) శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. ఈ సర్జరీలు నిర్వహించే పరికరం కార్డియాలజీ ఫల్మనరీ బైపాస్ మిషన్(సీపీబీ) మరమ్మతులకు గురవడంతో.. కొద్ది రోజులుగా ఈ సేవలకు బ్రేక్ పడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన వైద్య పరికరాలను ఎప్పటికప్పుడు సమకూర్చేది. కూటమి ప్రభుత్వం వచ్చాక పేదల ఆరోగ్యంపై నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. కేజీహెచ్కు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచీ పేద రోగులు ఎక్కువగా వస్తుంటారు. ప్రైవేట్/కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఇలాంటి వారికి కేజీహెచ్ పెద్ద దిక్కుగా మారింది. కేజీహెచ్ కార్డియాలజీ విభాగం రెండో అంతస్తులో కార్డియోథోరసిక్ విభాగంలో వైద్యులు ఈ శస్త్రచికిత్సలు అందిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో సీపీబీ మిషన్ తెప్పించి, శస్త్ర చికిత్సలకు ఆటంకం లేకుండా చూశారు. ఓపెన్ హార్ట్ సర్జరీలు, స్టంట్లు, గుండెలో బ్లాక్లకు అవసరమైన వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. ఇప్పుడీ సేవలకు అంతరాయం కలగడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్జరీ సమయంలో హార్ట్కు పంపింగ్ చేసేందుకు సాయపడే ఈ పరికరం లేకపోతే సర్జరీలు చేయడం చాలా కష్టం అని వైద్యులు చెబుతున్నారు.