
బాయ్కాట్
బదిలీ కౌన్సెలింగ్
డీఈవో కార్యాలయాన్ని ముట్టడించిన ఎంటీఎస్ టీచర్లు
● గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.39ను పట్టించుకోవట్లేదని ఆవేదన ● సర్వీసంతా ఏజెన్సీలోనే పనిచేయాలనడంపై ఆక్షేపణ ● మైదాన ప్రాంతంలోని ఖాళీల్లో బదిలీ చేయాలని డిమాండ్
ఆరిలోవ : విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) కార్యాలయాన్ని మినిమం టైం స్కేల్(ఎంటీఎస్) ఉపాధ్యాయులు ఆదివారం ముట్టడించారు. బదిలీ కౌన్సెలింగ్ను బాయ్కట్ చేశారు. 1998, 2008 డీఎస్సీల ఎంటీఎస్ ఉపాధ్యాయులకు బదిలీల కౌన్సెలింగ్ విశాఖ వ్యాలీ స్కూల్లో ఆదివారం నిర్వహించేందుకు విద్యాశాఖాధికారులు సన్నద్ధమయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుసుకున్న ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదాన ప్రాంతాల్లో ఖాళీలు చూపించడం లేదంటూ కౌన్సెలింగ్ను బాయ్కాట్ చేశారు. వారికి పలు ఉపాధ్యాయ సంఘాలు సంఘీభావం తెలిపాయి. డీఈవో కార్యాలయాన్ని ముట్టడించి, తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. డీఈవో కార్యాలయం నుంచి విశాఖ వ్యాలీ స్కూల్ వద్దకు వెళ్తున్న డీఈవో ఎన్.ప్రేమ్కుమార్ను చుట్టుముట్టారు. తమకు న్యాయం చేయాలని, మైదాన ప్రాంతంలోని పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యా శాఖాధికారులు బలవంతంగా తమను కొండలపైకి పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జీవో నంబరు 39 ద్వారా ఎంటీఎస్ ఉపాధ్యాయులకు నివాసముంటున్న ప్రాంతాలకు దగ్గరలో ఉద్యోగం చేసుకునే సౌలభ్యం కల్పించిందన్నారు. ఇటీవల విద్యాశాఖా మంత్రి లోకేష్ను కలిస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మాట మార్చి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర జీతాలతో ఉన్న తమపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. కౌన్సెలింగ్కు ఎవరూ హాజరుకాకపోవడంతో విద్యాశాఖాధికారులు సాయంత్రం వరకు వేచిచూడాల్సి వచ్చింది.
జీవో అమలుచేయాలి
1998, 2008 ఎంటీఎస్ ఉపాధ్యాయుల కోసం 2023లో అప్పటి ప్రభుత్వం జీవో నెం.39ను విడుదల చేసింది. దాని ప్రకారం ఎంటీఎస్ ఉపాధ్యాయులను నివాసాలకు దగ్గరగా ఉండేలా బదిలీలు జరగాలి. ఇప్పుడు ఆ జీవో ప్రకారం జరగట్లేదు. ప్రస్తుతం ఖాళీలన్నీ పాడేరు, ముంచంగిపుట్టు, కొయ్యూరు, పెదబయలు, అరకు, అనంతగిరి తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే అక్కడ రెండేళ్ల పాటు వారంతా ఉద్యోగాలు చేశారు. ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో బదిలీ చేయాలని కోరుతున్నాం.
– డి.గోపీనాథ్,
పీఆర్టీయూ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు
ఖాళీలన్నీ ఏజెన్సీలోనే చూపిస్తున్నారు..
ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఖాళీలన్నీ ఏజెన్సీ ప్రాంతంలోనే చూపిస్తున్నారు. ఇప్పటికే రెండేళ్లు కొండలపై ఉద్యోగాలు చేశాం. ఇప్పుడు కూడా కొండ ప్రాంతాలకే బదిలీపై వెళ్లాలి. ఇప్పుడు వెళ్తే రిటైర్మెంట్ వరకు అక్కడ పనిచేయాల్సిందే. మాకు వచ్చే జీతం రూ.32 వేలు. ఎలాంటి అలవెన్సులు ఉండవు. అయినా కొండ ప్రాంతాల్లోనే సర్వీసంతా పనిచేయాలంటున్నారు.
–టి.లింగమూర్తి,
2008 ఎంటీఎస్ ఉపాధ్యాయుడు
క్లస్టర్ల ద్వారా భర్తీ చేయాలి
ఉమ్మడి విశాఖ జిల్లాలో 220 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ల పరిధి మైదాన ప్రాంతాల్లో ఖాళీ పోస్టులు ఉంటాయి. ఆ ఖాళీల్లో మమ్మల్ని భర్తీ చేస్తే కొందరికై నా మైదాన ప్రాంతాల్లో పనిచేసే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం మమ్మల్ని చిన్నచూపు చూస్తోంది. మాకు న్యాయం జరిగే వరకు బదిలీ కౌన్సెలింగ్కు హాజరుకాము.
– లక్ష్మి, 2008 బ్యాచ్
సర్వీసంతా అక్కడే చేయాలా..
1998, 2008 డీఎస్సీ బ్యాచ్ల్లో 425 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులం ఉన్నాం. ఇటీవల రెగ్యులర్ ఉపాధ్యాయులను మైదాన ప్రాంతాల్లో నింపేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీలు చూపిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అక్కడకు వెళ్తే సర్వీసంతా అక్కడే ఉద్యోగం చేయాలి. మాకొచ్చే జీతాలతో అక్కడ గడపడం ఎంత కష్టమో తెలియని కాదు. విద్యాశాఖాధికారులు న్యాయం చేయాలి.. – రాజు, 2008 బ్యాచ్

బాయ్కాట్

బాయ్కాట్

బాయ్కాట్

బాయ్కాట్