
ఉద్యోగుల కృషితోనే షిప్యార్డ్ అభివృద్ధి
కమొడోర్
హేమంత్ ఖత్రి
సింథియా: హిందూస్తాన్ షిప్యార్డ్ 85వ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. వేడుకల్లో భాగంగా సంస్థ ఆవరణలోని వాల్చంద్ హీరాచంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉద్యోగుల మౌలిక సదుపాయాలను పెంచే లక్ష్యంతో చేపట్టిన వాల్వ్ టెస్టింగ్ బే, డిజిటల్ కియోస్క్, పునరుద్ధరించిన డైనింగ్ హాల్, కొత్త పవర్ రూమ్ వంటి పలు సౌకర్యాలను సంస్థ సీఎండీ కమొడోర్ హేమంత్ ఖత్రి ప్రారంభించారు. అలాగే షిప్యార్డ్లో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను తెలిపే బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హేమంత్ ఖత్రి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి తమ విధి నిర్వహణలో మానసిక ప్రశాంతతను కలిగి ఉంటేనే సంస్థ ఉత్పత్తిలో మెరుగైన ఉత్పాదకతను సాధించగలదన్నారు. సంస్థ చిన్న టగ్లను నిర్మించే స్థాయి నుంచి ఐఎన్ఎస్ ధ్రువ్, నిస్టార్ వంటివి నిర్మించే స్థాయికి ఎదిగిందన్నారు. ఇందులో ఉద్యోగుల కృషి ఎంతో ఉందని కొనియాడారు. కార్యక్రమంలో షిప్యార్డ్ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.