సింహాచలం: వచ్చే నెల 30న జరగనున్న చందనోత్సవంలో స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్వోపీ)ను రూపొందించినట్లు రాష్ట్ర దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ తెలిపారు. బుధవారం సింహాచలం వచ్చిన ఆయన స్వామివారిని దర్శించుకుని, స్థానిక మీడియాతో మాట్లాడారు. సింహాచలం క్షేత్రంలో చందనోత్సవం చాలా పెద్ద ఉత్సవమని, రోజులో కొన్ని గంటలు మాత్రమే ఉంటుందన్నారు. ఏటా లక్ష 50 వేలమంది భక్తులతో పాటు వీఐపీలు కూడా స్వామివారి నిజరూప దర్శనానికి వస్తారన్నారు. ఇప్పటి వరకు జరిగిన పలు చందనోత్సవాల్లో ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎస్ఓపీ రూపొందించామన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. చందనోత్సవం నిర్వహణపై వచ్చేనెల మొదటి వారంలో ప్రభుత్వ స్థాయిలో దేవదాయశాఖ, హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రులతో ఒక సమావేశం జరుగుతుందన్నారు. దేవదాయశాఖలో ఎన్ఎంఆర్ల పర్మినెంట్ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు.
దర్శనార్థం ఆలయానికి వచ్చిన ఆయన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, బేడా మండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక, శేషవస్త్రాన్ని ఈవో కె.సుబ్బారావు అందించారు.