 
															బోనస్ పైసలేవీ!
గత ఏడాది సేకరించిన సన్నరకం వడ్లు 32వేల మెట్రిక్ టన్నులు
ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు శ్రీనివాస్. పరిగి మండలం ఐనాపూర్ గ్రామానికి చెందిన ఇతనికి ఐదెకరాల పొలం ఉంది. గత యాసంగి సీజన్లో సన్నరకం వరి పంట సాగు చేశాడు. 65 క్వింటాళ్ల దిగుబడి రావడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించాడు. ధాన్యం డబ్బు రూ.1.56 లక్షలు ఖాతాతో జమ కాగా బోనస్ డబ్బు రూ.32 వేల కోసం ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నాడు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
వికారాబాద్: సన్నరకం వడ్ల బోనస్ కోసం రైతులు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించారు. ప్రభుత్వం క్వింటాలు సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. మే, జూన్ మాసాల్లో వడ్లు సేకరించినా నేటికీ బోనస్ అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వానాకాలం ధాన్యం సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గత సీజన్కు సంబంధించిన బోనస్ రైతుల ఖాతాల్లో జమ కాకపోవడంతో ప్రస్తుత సీజన్ కొనుగోళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఏటా లక్ష్యానికి దూరంగా కొనుగోళ్లు
జిల్లాలో ఏటా వరిసాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. దిగుబడిని అంచనా వేస్తున్న అధికారులు కొనుగోలు లక్ష్యం పెట్టుకుంటున్నారు. అయితే అందులో సగం కూడా సేకరించలేక పోతున్నారు. గత యాసంగిలో 93 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా రెండు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రైవేటుకు విక్రయించింది పోనూ 1.1 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా 53 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా వడ్లను రైతులు బహిరంగ మార్కెట్లో విక్రయించారు. 2024 ఖరీఫ్ సీజన్లో 1.30 లక్షల ఎకరాల్లో వరి పంట వేయగా 2.8లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. లక్ష మెట్రిక్ టన్నులు సేకరించాలని భావించారు. అయితే కేవలం 45 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు.
ఈ ఏడాది అంచనాలకు మించి..
ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో 92 వేల ఎకరాల్లో వరి పంట వేశారు. రెండు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రైవేటుకు పోను 90 వేల నుంచి లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని భావించారు. అంచనాలుకు మించి లక్ష మెట్రిక్ టన్నులు సేకరించారు. ఇందుకు సంబంధించిన మొత్తం రూ.250 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. మరో 32 వేల మెట్రిక్ టన్నుల సన్నరకం వడ్లు కొనుగోలు చేసి రూ.72 కోట్లు రైతుల ఖాతాల్లో జ మ చేశారు. బోనస్ రూ.16 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
పెరిగిన సన్నాల సాగు
జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ సారి సన్నరకం వడ్ల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత సంవత్సరం 14 వేల ఎకరాల్లో సన్నాలు సాగు కాగా ఈ సారి 35 వేల ఎకరాల్లో పంట వేశారు. బహిరంగ మార్కెట్లో సన్న రకం బియ్యానికి మంచి ధర లభిస్తుండటం, ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఎక్కువ మంద రైతులు సాగు చేస్తున్నారు.
రైతులకు చెల్లించిన మొత్తం రూ.73 కోట్లు
బోనస్ రూపంలో ఇవ్వాల్సింది రూ.16 కోట్లు
వెంటనే చెల్లించాలంటున్న అన్నదాతలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
