
మున్సిపల్ నిధులు పక్కదారి!
తాండూరు: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు తాండూరు మున్సిపల్ అధికారులు చేపట్టిన చర్యల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందని పనులకు అడ్డగోలుగా నిధులు వెచ్చించారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పారిశుద్ధ్య కార్మికుల పేరిట, పాత స్టాక్ బ్లీచింగ్ పౌడర్ నిల్వలను చూపించి ఏకంగా రూ.15 లక్షలకు పైగా అవినీతికి పాల్పడినట్లు స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఒక్కో చీర రూ.1,800
తాండూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డులున్నాయి. దాదాపు 15 వేల గృహాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే సుమారు 260 మంది వరకు పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనులు చేయిస్తారు. అందుకుగాను సిబ్బందికి శానిటరీ కిట్స్తో పాటు దుస్తులు పంపిణీ చేస్తారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్తో పాటు సిబ్బంది ఆయా సామగ్రిని తీసుకొచ్చారు. ప్రత్యేకాధికారి సుధీర్ అనుమతితో హాకా సంస్థకు నామినేషన్ పద్ధతిన ఈ కాంట్రాక్ట్ మొదట అప్పగించారు. అది కాదని స్థానిక కాంట్రాక్టర్ ద్వారానే సామగ్రిని కొనుగోలు చేయించారు. ఇందులో నాసిరకం దుస్తులకే అధిక ధరలు చెల్లించినట్లు బిల్లులు సృష్టించారు. పారిశుద్ధ్య పనులు చేసే మహిళలకు ఇచ్చే ఒక్కో చీర రూ.500 వరకు ఉంటే ఏకంగా రూ.1,800 వెచ్చించినట్లు చూపారు. ఒక టవల్ ఖరీదు రూ.100 వరకు ఉంటే దాన్ని రూ.600లకు కొన్నట్లు బిల్లులు రూపొందించడం గమనార్హం.
పాత స్టాక్ చూపి నిధులు స్వాహా
బ్లీచింగ్ పౌడర్ నిధులను మున్సిపల్ అధికారులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో బ్లీచింగ్ పౌడర్ 10 టన్నుల వరకు వినియోగం ఉంటుందంటూ రికార్డులు సిద్ధం చేశారు. అయితే క్వింటాలుకు సుమారు రూ.1,700ల వరకు పలుకుతోంది. అయితే పాత మున్సిపల్ కార్యాలయంలో బ్లీచింగ్ పౌడర్ పాత స్టాక్ నిల్వలున్నాయి. వాటినే చూయించి మున్సిపల్ అధికారులు నిధులను దారి మళ్లించారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతరు
ఈ ఏడాది జనవరి నెలలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో జరిగిన చివరి సమావేశంలో ఎజెండాలో శానిటేషన్ పనుల కోసం రూ.40 లక్షల నిధుల ఆమోదం కోసం తీసుకెళ్లారు. అయితే పలువురు కౌన్సిలర్లు బ్లీచింగ్ పౌడర్ పేరిట నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అంశాన్ని పక్కన పెట్టాలని కమిషనర్కు సూచించారు. ఆరు నెలల తర్వాత మున్సిపల్ అధికారులు రూ.40 లక్షలతో పాటు అదనంగా మరో రూ.10 లక్షలు పెంచి పారిశుద్ధ్య సామగ్రిని కొనుగోలు చేయడం విమర్శలకు తావిస్తోంది.
రూ.10 లక్షల సామగ్రి కొనుగోలుకి రూ.50 లక్షల బిల్లు
పాత బ్లీచింగ్ స్టాక్ చూయించి కాసులు నొక్కేసిన వైనం
అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
వివరాలు తెలుసుకుంటాను
మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం కొనుగోలు చేసిన సామ గ్రికి నిధులు ఎన్ని వెచ్చించారనే అంశం నా దృష్టికి రాలేదు. శానిటరీ ఇన్స్పెక్టర్ను అడిగి వివరాలు తెలుసుకుంటాను. ప్రత్యేకాధికారి ఆదేశాల మేరకే సామగ్రి కొనుగోళ్లు జరిగాయి.
– విక్రమ్సింహారెడ్డి, కమిషనర్, తాండూరు

మున్సిపల్ నిధులు పక్కదారి!

మున్సిపల్ నిధులు పక్కదారి!