
‘టెక్స్టైల్’ భూముల విక్రయానికి యత్నం!
నందిగామ: టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసి, స్థానికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కొనుగోలు చేసిన భూమిని విక్రయించేందుకు కొందరు డైరెక్టర్లు యత్నిస్తున్నారని సొసైటీ సభ్యులు ఆరోపించారు. కొందరు రైతులతో కలిసి ఆదివారం హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ వద్ద ఆదివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 2002, 2003 సంవత్సరంలో టెక్స్టైల్ పార్క్ కోసం చేగూరు రెవెన్యూ పరిధి నర్సప్పగూడ గ్రామ శివారులో 142 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని తెలిపారు. ఆ సమయంలో 108 మంది సభ్యులు, 8 మంది డైరెక్టర్లతో ఒక సొసైటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆ భూమిలో ప్రభుత్వ రాయితీతో పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానికులకు, భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చామని వివరించారు. కానీ అనుకున్న ఆశయం నెరవేరకుండా కొందరు డైరెక్టర్లు ఎవరికీ తెలియకుండా ఆ భూములను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. తామంతా కష్టపడి సంపాదించిన డబ్బులతో భూములు కొనుగోలు చేశామని, మా భూములు మాకు కేటాయిస్తే పరిశ్రమలు స్థాపించి, పలువురికి ఉపాధి చూపుతామని చెప్పారు. సంబంధిత అధికారులు స్పందించి, జాగల విక్రయానికి యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని, ఆ భూములను తమకు అప్పగించాలని కోరారు. కార్యక్రమంలో బోర్డు సభ్యులు పురుషోత్తం, గడ్డం దేవదాస్, వెంకటరమణ, శ్రీరాములు, సురేంద్ర, రవి, రమేష్, బలరాం తదితరులు పాల్గొన్నారు.
నిరసన వ్యక్తంచేసిన సొసైటీ సభ్యులు