● 108కి కాల్ చేసినా స్పందన కరువు
● ప్రైవేటు వాహనంలో ఆస్పత్రికి తరలింపు
బషీరాబాద్: మెడికల్ అత్యవసర సేవలు పడకేశాయి. అర్ధరాత్రి పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లడానికి 108కి కాల్ చేస్తే బిజీ అంటూ రెండు గంటల పాటు ఎదురు చూశారు. చివరకు అంబులెన్స్ రాకపోవడంతో ఓ ప్రైవేటు వాహనంలో గర్భిణీని తాండూరు మాతాశిశు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పురిటి నొప్పులతో తల్లడిల్లిన ఆమెకి వైద్యులు కాన్పు చేశారు. ఈ ఘటన మండలంలోని నవల్గాలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కాశీంపూర్ శ్యామల నిండు గర్భిణీ. శనివారం రాత్రి 11.45 గంటలకు పురిటి నొప్పులు రావడంతో భర్త నరేష్ 108 అంబులెన్స్కు కాల్ చేశారు. అవి ఇతర సేవల్లో బిజీ ఉన్నాయి. 30 నిమిషాలు ఆగాలని టీల్ ఫ్రీ సిబ్బంది చెప్పారు. తీరా అర్ధ గంట తర్వాతా చేస్తే బిజీ ఉన్నాయి.. తర్వాత చేయండని రెండు గంటల పాటు తమను వేచి ఉండేలా చేశారని బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రైవేట్ వాహనంలో తాండూరులోని మాతాశిశు ఆస్పత్రికి తరలించారు. గర్భిణీకి అక్కడి వైద్యులు కాన్పు చేయడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
ఉద్యోగి అనుమానాస్పద మృతి
మీర్పేట: అనుమానాస్ప ద స్థితిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కాలనీవాసులు, ఇన్స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం.. ఏపీ కృష్ణా జిల్లా పెద్దమద్దాలి గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వరరావు(59) పదేళ్లుగా బడంగ్పేట సాయిప్రభు హోమ్స్ కాలనీలో భార్య జయంతి, కుమారుడు రాజ్భరత్, కోడలు గౌతమితో కలిసి ఉంటున్నాడు. ఆయన ఆబిడ్స్లోని పేఅండ్ అకౌంట్స్ కార్యాలయంలో ఆడిటర్గా విధులు నిర్వహించేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం వెంకటేశ్వరరావు నీటి సంపులో శవమై తేలాడు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియాకు తరలించారు.
మృతిపై అనుమానాలు
కొంత కాలంగా తనను భార్య, కుమారుడు, కోడలు వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మృతుడు వెంకటేశ్వరరావు తరచూ తమతో చెప్పేవాడని కాలనీవాసులు పేర్కొన్నారు. తండ్రి చనిపోతే కుమారుడికి ఉద్యోగం వస్తుందని, అందుకే మానసికంగా వేధిస్తున్నారని తెలిపినట్లు చెప్పారు. ఇక్కడే ఉంటే తనను చంపేలా ఉన్నారని, వారం రోజుల్లో మలక్పేటలోని ప్రభుత్వ క్వార్టర్కు మారుతానని శనివారం రాత్రి చెప్పినట్లు స్థానికులు వెల్లడించారు. ఆయన మృతిపై అనుమానం ఉందని, మృతుడి కుమార్తె ధరణిదేవి మీర్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
వేడుకగా వీరభద్రస్వామి ఆలయ వార్షికోత్సవం
రాజేంద్రనగర్: బుద్వేల్లోని వీరభద్రస్వామి భద్రకాళి ఆలయ మూడవ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా దేవాలయాన్ని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. ఉదయం అభిషేకం, అలంకరణ అనంతరం భక్తులకు వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మవారి దర్శనాన్ని ప్రారంభించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా తగు ఏర్పాట్లు చేపట్టారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.