
నిబంధనలకు తూట్లు
తాండూరు టౌన్: పట్టణం మీదుగా వెళ్తున్న నేషనల్ హైవే 167(ఎన్) డ్రైన్ నిర్మాణ పనులు ఇష్టానుసారంగా కొనసాగుతున్నాయి. అడిగేవారు లేరని సదరు ఆర్అండ్బీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు. దీనిపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక బస్టాండు నుంచి చించోళి మార్గంలో నేషనల్ హైవే రోడ్డుకు ఇరువైపులా ఆర్అండ్బీ అధికారులు డ్రైన్ నిర్మాణ పనులు చేస్తున్నారు. అయితే రోడ్డుపై అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను, ట్రాన్స్ఫార్మర్లను తొలగించకుండానే పనులు ప్రారంభించారు. నిబంధనల ప్రకారం డ్రైన్కు లోపల ఉన్న విద్యుత్ సంబంఽధితమైనవి ఏవీ ఉన్నా వాటిని తొలగించిన తర్వాత నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే సదరు ఆర్అండ్బీ అధికారులు దీనికి భిన్నంగా ఎక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్లను అక్కడే ఉంచి ఇరుకుగా, వంకలు తిప్పుతూ పట్టణంలోని మల్లప్ప మడిగ వద్ద డ్రైన్ నిర్మిస్తున్నారు. దీంతో ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు తొలగించాలని విద్యుత్ అధికారులకు అర్జీ పెట్టుకుని, అందుకు అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. కానీ అవేవి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి డ్రైన్ నిర్మాణ పనులు సక్రమంగా జరిగేలా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇష్టానుసారంగా హైవే డ్రైన్ నిర్మాణ పనులు