
మారిస్తేనే మనుగడ
● కేబుల్ లైఫ్ టైం 25 ఏళ్లలోపే! ● ఆ లోపే మార్చేయాలి..లేదంటే ప్రమాదాలు తప్పవు ● లోడుకు తగ్గ వైరింగ్, ఎంసీబీలు, ప్రాపర్ ఎర్తింగ్తోనే రక్షణ ● ‘సాక్షి’తో ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు కార్యదర్శి కాంతారావు
ప్రాపర్ ఎర్తింగ్తోనే ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ..
మెజార్టీ భవనాల్లో ఎర్తింగ్ సిష్టం ఉండటం లేదు. ఒక వేళ ఉన్నా.. సరఫరాలో హెచ్చు తగ్గుల సమస్య వచ్చినప్పుడు పని చేయడం లేదు. వేసవిలో ఎర్తింగ్ పాయింట్లో తేమ శాతం తగ్గుతుంది. ప్రతి పదిరోజుకో సారి నీటిని పో యడం ద్వారా విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు తలెత్తినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించొచ్చు. అంతేకాదు పోల్ నుంచి ఇంట్లోకి కరెంట్ సరఫరా చేసే సర్వీసు వైరు వెంట సాధారణంగా జీఏవైర్ను ఏర్పాటు చేస్తుంటాం. షార్ట్ సర్క్యూట్ కారణంగా పోల్పై ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు హై ఓల్టేజ్ విద్యుత్ ఇంట్లోకి ప్రవేశించకుండా నియంత్రించేందుకు ఎగ్ ఇన్సులేటర్ వినియోగించాలి. విద్యుత్ లీకేజీలు లేకుండా చూసుకోవడం, ప్రతి ఇన్సు లేషన్కు ఎంసీబీలు, ఆర్సీసీసీబీలను ఏర్పాటు చేసుకోవడం వల్ల విద్యుత్ ప్రమాదాలు తలెత్తకుండా చూసుకోవచ్చు అని కాంతారావు స్పష్టం చేశారు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘సాధారణంగా ఈ కేబుల్ జీవిత కాలం 25 ఏళ్లు మాత్రమే. ఆలోపే వాటిని మార్చేయాలి. ఐఎస్ఐ ప్రమాణాల మేరకే ఈ వైర్లను రూపొందించినప్పటికీ..వాటి సామర్థ్యానికి మించి లోడు కరెంట్ను వినియోగించడం, అంతర్గతంగా తలెత్తే వేడికి బయటి ఉష్ణోగ్రతలు తోడవడంతో ఆయా కేబుళ్లు తీవ్రమైన ఒత్తిడికి లోనైవుతుంటాయి. జాయింట్లు, లూజు కాంటాక్ట్ల వద్ద తరచూ స్పార్క్లు వెలుగు చూస్తుంటాయి. ఇటీవల వెలుగు చూస్తున్న మెజార్టీ విద్యుత్ ప్రమాదాలకు ఇదే ప్రధాన కారణం’ అని ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు కార్యదర్శి, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ టి.కాంతారావు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. గృహాలు, వాణిజ్య సముదాయాల్లో తరచూ వెలుగు చూస్తున్న విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆయన మాటల్లోనే..
పాతవైర్లపైనే అదనపు లోడు..
మెజార్టీ గృహాలు, వాణిజ్య సముదాయాల్లో 1.5 స్క్వైర్ ఎంఎం, 2.5 స్క్వైర్ ఎంఎం సామర్థ్యానికి మించిన కేబుళ్ల వాడటం లేదు. ఈ కేబుళ్ల జీవిత కాలం కూడా 25 ఏళ్లకు మించి ఉండదు. అంతేకాదు ఒకప్పుడు సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పది లైట్లు, నాలుగు ఫ్యాన్లు, ఒక టీవీ, కూలర్, రిఫ్రిజిరేటర్, కంప్యూటర్, మిక్సీ, ఐరెన్ బాక్స్ మాత్రమే కన్పించేవి. తీరా ఆదాయం, ఇంటి అవసరాలు పెరిగిన తర్వాత వాటి సరసన ఏసీలు, గీజర్లు, వాషింగ్ మిషన్లు వచ్చి చేరుతున్నాయి. ఫలితంగా విద్యుత్ వినియోగం రెట్టింపవుతోంది. ఆ మేరకు పాత లైన్లను తొలగించి, వాటి స్థానంలో ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా వైర్లను ఏర్పాటు చేయడం లేదు. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాతలైన్లపై మరింత భారాన్ని మోపుతున్నారు. ఫలితంగా కేబుళ్లు ఒత్తిడికి గురై...షార్ట్ సర్క్యూట్లు తలెత్తుతున్నాయి. అంతేకాదు నిర్మాణ సమయంలో భవిష్యత్తు విద్యుత్ అవసరాలను అంచనా వేయలేక పోవడం వెరసి నిర్మాణ ఖర్చును తగ్గించుకునే క్రమంలో నాసిరకం విద్యుత్ వైర్లు, స్విచ్లు కొనుగోలు చేస్తుండటం కూడా ఈ ప్రమాదాలకు మరో కారణం. అంతేకాదు ఒకే సాకెట్ నుంచి మల్టీపుల్ ప్లగ్ కనెక్షన్లు ఇవ్వడం కూడా ప్రమాదాలకు కార ణమవుతోంది.
ఒత్తిడితోనే కంప్రెసర్లలో పేలుళ్లు..
ఇతర ఎలక్ట్రికల్ వస్తువులతో పోలిస్తే ఏసీ, గీజర్, వాషింగ్ మిషన్, ఓవెన్లకు విద్యుత్ లోడు ఎక్కువ అవసరం. సాధారణంగా మార్కెట్లో ఒకటి, ఒకటిన్నర, రెండు టన్నుల సామర్థ్యం ఏసీలు లభిస్తుంటాయి. ఏసీ సామర్థ్యాన్ని బట్టి కేబుళ్లను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా 1.5 టన్ను ఏసీకి 4 నుంచి 6 స్క్వైర్ ఎంఎంపైగా కేబుల్స్ వినియోగించాలి. కానీ మెజార్టీ భవనాల్లో 2.5 స్క్వైర్ ఎంఎం కేబుళ్లనే వాడుతున్నారు. పాత ఏసీల్లో ఇన్వర్టర్ మోడ్ సహా పవర్ సేవింగ్కు అవకాశం లేదు. ఇందు కోసం ఇన్వర్టర్ మోడ్ ఉన్న ఫైవ్ స్టార్, త్రీస్టార్ రేటింగ్ ఏసీలను ఎంపిక చేసుకోవాలి. ఏసీలను రోజంతా ఆన్లో ఉంచడం వల్ల కంప్రెసర్లో హీట్ జనరేట్ అవుతుంది. ఇన్వర్టర్ బ్యాటరీలను గాలి, వెలుతురు లేని ఇరుకై న ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల ఒత్తిడికి గురై..షార్ట్సర్క్యూట్లు తలెత్తుతున్నాయి. ఇన్వర్టర్ బ్యాటరీల్లో మూడు నెలలకోసారి డిస్టిలరీ వాటర్ నింపాలి. వీటి నిర్వహణ లోపం వల్ల కూ డా బ్యాటరీలు పేలుతుంటాయి. గుల్జార్హౌస్లో వెలుగు చూసిన ప్రమాదానికి ఇది మరో కారణం కూడా.