
జులై 10న మెగా పేరెంట్–టీచర్ సమావేశం
తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,289 అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో జులై 10న మెగా పేరెంట్ టీచర్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ తెలిపారు. సమగ్ర శిక్ష సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. దీనికోసం పాఠశాలలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూల్ గ్రాంట్లను మంజూరు చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా వెయ్యి మందికిపైగా విద్యార్థులున్న పాఠశాలలకు రూ.లక్ష , 251 నుంచి వెయ్యి మందికి లోపల విద్యార్థులున్న పాఠశాలలకు రూ.75 వేలు, 100 నుంచి 250 మధ్య విద్యార్థులున్న పాఠశాలలకు రూ.50 వేలు, 31 నుంచి వంద మంది వరకు విద్యార్థులున్న పాఠశాలలకు రూ.25 వేలు, 30 మందికి లోపు విద్యార్థులున్న పాఠశాలలకు రూ.10 వేలు గ్రాంటును మంజూరు చేయనున్నామని, ఇప్పటికే 50 శాతం గ్రాంటును విడుదల చేయగా అందులో 20శాతం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశ నిర్వహణకు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో విద్యార్థుల మార్కులు, హాజరు, ఆరోగ్యం, సహ పాఠ్య కార్యకలాపాల్లో చూపిన ప్రతిభ వంటి అంశాలతో కూడిన విద్యార్థుల ప్రగతిని తెలిపేలా ప్రోగ్రెస్ కార్డులు అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివిధ ఆటల పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తొలిసారిగా ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోనూ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.