
తిరుపతిలోనే డాక్టర్ల రిజిస్ట్రేషన్ సేవలు
తిరుపతి తుడా: డాక్టర్ల రిజిస్ట్రేషన్, రీ రిజిస్ట్రేషన్ సేవల ప్రక్రియను జిల్లా స్థాయిలో తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో ప్రారంభించినట్టు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన శనివారం ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీ హరిరావుతో కలిసి స్థానిక ఎస్వీ వైద్య కళాశాల సామాజిక విభాగంలో డాక్టర్ల రిజిస్ట్రేషన్, రీ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శాశ్వత రిజిస్ట్రేషన్కు తప్ప మిగిలిన అన్ని సేవల కోసం డాక్టర్లు విజయవాడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొదటిసారి జిల్లాలోనే అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రతి శనివారం, ఆదివారం పాత జిల్లాల ఆధారంగా సేవలు అందించడం కోసం తీసుకున్న నిర్ణయం అభినదనీయమన్నారు. తిరుపతిలో మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడం శుభ పరిణామని, సేవలను జిల్లాలోని సీనియర్ వైద్యులు, వైద్యులు, వైద్య విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలోనే రెన్యువల్, రీ రెన్యువల్ తదితర సేవలు అందించేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. రీ–రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫీజు తగ్గించామని చెప్పారు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ టాపర్స్కు ప్రతి సంవత్సరం గోల్డ్ మెడల్స్ అందించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, డాక్టర్ ప్రమీల, డాక్టర్ జనార్థన్, డాక్టర్ వాసుదేవనాయుడు, డాక్టర్ యుగంధర్, వైద్య మండలి సిబ్బంది పాల్గొన్నారు.