
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిలో ఒక మహిళ మృతి చెందగా రామచంద్రాపురం మండలంలోని పరమాల గ్రామానికి చెందిన యువకుడు దుర్మరణం చెందారు. పలువురు గాయాలపాలయ్యారు. వివరాలు ఇలా..
పెళ్లకూరు : నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి మార్గంలో శనివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో సరస్వతి(50) అనే మహిళ మృతి చెందగా, మరో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల సమాచారం మేరకు విజయనగరం ప్రాంతానికి చెందిన లహరి తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దైవ దర్శనానికి కారులో వెళుతున్నారు. మార్గం మధ్యలో ఎగువచావలి గ్రామం వద్ద ముందు వెళుతున్న గుర్తు తెలియని లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వెళుతున్న కారు ముందు లారీని ఢీకొంది.ఈ ఘటనలో కారులో వెళుతున్న సరస్వతి, లహరి, మీనా, నవ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే మొబైల్ కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్లో శ్రీకాళహస్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది. అదే విధంగా నెల్లూరు నుంచి బెంగుళూరు వెళుతున్న కారు మార్గం మధ్యలో తాళ్వాయిపాడు గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దువ్వూరు శ్రావణ్కుమారెడ్డి, రవీంద్రారెడ్డిలకు గాయాలయ్యాయి. స్థానికులు చికిత్సల నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉప్పరపల్లి వద్ద యువకుడు..
రామచంద్రాపురం : మండల పరిధిలోని పరమాల గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన తగీరు చిట్టిబాబు(38) మూడు రోజుల కిందట వ్యక్తిగత పనులపై తన స్నేహితుడితో కలసి తిరుపతి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఉప్పరపల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడగా వాహనం వెనుక వైపు కూర్చున్న చిట్టిబాబు తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే రుయా హాస్పిటల్కు తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం స్విమ్స్కు తరలించగా శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడు చిట్టిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి