
బాలుడు అదృశ్యంపై కేసు
రేణిగుంట : ఇంటి నుంచి ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు తిరిగి రాకపోవడంతో తల్లి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేశామని గాజులమండ్యం ఎస్ఐ సుధాకర్ తెలిపారు. వివరాలు.. ఉత్తరప్రదేశ్కు చెందిన సంగీతాదేవి, మోహన్సింగ్ దంపతులు 8 నెలలుగా రేణిగుంట మండలం వినాయకపురంలో నివాసం ఉంటున్నారు. మే 25వ తేదీ మధ్యాహ్నం వారి కుమారుడు ఆదిత్య (12) తోటి పిల్లలతో ఆడుకొని వస్తానని వెళ్లాడు. . సాయంత్రానికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. బంధువులు, తెలిసినవారిని విచారించగా వారి దగ్గరికి వెళ్లలేదని తెలియడంతో మంగళవారం గాజుల మండ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
టెంపో బోల్తా :
ఐదుగురికి గాయాలు
ఓజిలి : మండలంలోని రాచపాళెం వద్ద మంగళవారం ఉదయం టెంపో బోల్తా పడడంతో ఐదుగురు గాయపడ్డారు. వివరాలు.. హైదరాబాద్కు చెందిన 14 మంది టెంపోలో అరుణాచలం, రామేశ్వరం, పాండిచ్చేరిలో వివిధ దేవాలయాలను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమంలో టెంపో అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగంది. ప్రశాంతి, సబిత, అంజమ్మ అనే మహిళలతోపాటు, మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే సిబ్బంది క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఎస్ఐ స్వప్న ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలుడు అదృశ్యంపై కేసు