
ఆదివారం ఉదయం 6.30 గంటలకే యాదగిరిగుట్టలో నిండిపోయిన వాహనాలు
కిక్కిరిసిన యాదగిరి క్షేత్రం
శ్రీస్వామి సన్నిధిలో 90 వేలమంది
ధర్మ దర్శనానికి 5 గంటల సమయం
వివిధ పూజలతో నిత్యాదాయం రూ.85.57 లక్షలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ సన్నిధితో పాటు పట్టణ పరిసరాలు, ఆధ్యాత్మిక వాడ.. ఎటు చూసినా భక్తులతో నిండిపోయింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు.. శ్రీస్వామి జన్మ నక్షత్రం స్వాతి కలిసి రావడంతో ఆదివారం శ్రీస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలు, దేశంలోని ఆయా ప్రాంతాల భక్తులు అధికంగా తరలి వచ్చారు.
ఉదయం నుంచే యాదగిరీశుడి క్షేత్రానికి భక్తుల తాకిడి మొదలైంది. భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, మాడ వీధులు, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలన్నీ నిండిపోయాయి. దీంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి 5 గంటలు, వీఐపీ దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. శ్రీనృసింహస్వామిని 90 వేల మంది భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివిధ పూజలతో ఆలయానికి నిత్యాదాయం రూ.85,57,558 వచి్చనట్లు అధికారులు వెల్లడించారు.
యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకొని ఆదివారం భక్తులు, ఆలయాధికారులు, స్థానికులు గిరి ప్రదక్షిణ చేశారు. ఉదయం 5 గంటలకు కొండ కింద గల వైకుంఠద్వారం వద్ద ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు వివిధ ప్రాంతాల కళాకారులు కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దంపతులు, ఈవో వెంకట్రావు పాల్గొన్నారు.