ఈ రోజు మన గౌరవం మీద దాడి జరిగింది: పొన్నం | TG Minister Ponnam Prabhakar Condemns BJP MP Tejaswi Comments | Sakshi
Sakshi News home page

ఈ రోజు మన గౌరవం మీద దాడి జరిగింది: పొన్నం

Apr 16 2026 5:45 PM | Updated on Apr 16 2026 6:13 PM

TG Minister Ponnam Prabhakar Condemns BJP MP Tejaswi Comments

హైదరాబాద్‌: పార్లమెంట్‌ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో  పోల్చుతూ తేజస్వి సూర్య పార్లమెంట్‌లో నిలబడి మాట్లాడటం మన గౌరవం మీద దాడి జరిగినట్లేనని పొన్నం ధ్వజమెత్తారు. ఈ మేరకు గాంధీభవన్‌ నుంచి ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్టాడుతూ.. 

‘ఇది మాట కాదు.  ఇది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం. ఇది మన పోరాటంపై దాడి. ఇది మన ఆత్మగౌరనానికి అయిన గాయం.  మనకు తెలంగాణ ఎలా వచ్చింది?,  రక్తంతో కాదు… రాజ్యాంగంతో వచ్చింది. హింసతో కాదు…  ప్రజాస్వామ్యంతో వచ్చింది. అలాంటి పవిత్రమైన ఉద్యమాన్ని…దేశ విభజనతో పోల్చే హక్కు ఎవరికీ లేదు’ అని హెచ్చరించారు.

పార్లమెంట్ అంటే గౌరవం ఉండాలి. అది చౌకబారు రాజకీయాల వేదిక కాదు. ఈ వేదిక నుండి నేను స్పష్టంగా చెబుతున్నాను. ఆ వ్యాఖ్యలను వెంటనే లోక్‌సభ రికార్డ్స్ నుండి తొలగించాలి.  ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇది పార్లమెంటరీ నియమావళి ఉల్లంఘనగా పరిగణించాలి. అవసరమైతే సభ్యత్వంపై కూడా చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు పొన్నం. 

తెలంగాణను అవమానిస్తుంటే రాష్ట్ర నుంచి కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. తెలంగాణను కించపరిచే వారికి తగిన బుద్ధి చెప్పాలని పొన్నం పేర్కొన్నారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement