సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. సింగరేణి మెడికల్ బోర్డును పునఃప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ రోజు ( శుక్రవారం) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే సింగరేణి మెడికల్ బోర్డును ప్రారంభించాలని అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. కాగా రేపు 335 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేయనున్నారు.
ఈ విషయమై ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ "మెడికల్ బోర్డు ప్రక్రియ ద్వారా నిజంగా అనారోగ్యంతో ఉండి, అర్హత కలిగిన కార్మిక ఉద్యోగులకు మాత్రమే పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరాలి. తద్వారా వారి వారసులకు కారుణ్య నియామకాల రూపంలో తక్షణ ఉపాధి అవకాశాలు లభిస్తాయి," అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.
ఈ కీలక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, మధ్యవర్తుల జోక్యం లేదా మోసాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన పారదర్శక వ్యవస్థను అమలు చేయాలని యాజమాన్యానికి సూచించారు. కాగా సింగరేణి మెడికల్ బోర్డు వివిధ కారణాలతో గత కొంతకాలంగా నిలిచిపోయింది.


