Covid 4th Wave: గత అనుభవాలతో గట్టిగా ఎదుర్కొందాం..!

Sakshi Special Article On Covid Fourth Wave

కరోనా.. ప్రపంచాన్ని గడగడ లాడించిన మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. రూపుమార్చుకుని.. కొత్త వేరియంట్లు/ ఉప వేరియంట్లతో మరోసారి దాడికి సిద్ధమైంది. ఇప్పటికే పలు దేశాల్లో విజృంభిస్తున్న ఈ వైరస్‌.. కొద్దిరోజులుగా మన దేశంలోనూ ప్రభావం చూపుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మన రాష్ట్రంలోనూ గణనీయంగానే నమోదవు తున్నాయి. గత మూడు వేవ్‌ల తాకిడికి మనమంతా తీవ్రంగా నష్టపోయినా గత అనుభవాలు నేర్పిన పాఠంతో వైరస్‌ను గట్టిగా ఎదుర్కోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.  – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

కొద్ది నెలలుగా కలకలం..
2019 డిసెంబర్‌లో చైనాలో కరోనా కలకలం మొద లైంది. అప్పటికే చాప కింద నీరులా చాలా దేశా లకు విస్తరించిన మహమ్మారి.. ఒక్కసారిగా పంజా విసరడం మొదలుపెట్టింది. ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ దేశాలను కబళించింది. ఒకటి, రెండు, మూడో వేవ్‌ అంటూ కరాళనృత్యం చేసింది. విస్తృతమైన వ్యాక్సినేషన్‌ ఓవైపు.. విపరీత మైన మ్యుటేషన్లతో వైరస్‌ బలహీనపడటం మరోవైపు.. కలిసి అదుపులోకి వచ్చింది. కాదు వచ్చినట్టే కనబడింది. కొద్దిరోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండటం, కొన్ని దేశాల్లో అయితే లక్షల్లో నమోదవుతూ ఉండటం కలవరం రేపుతోంది.

మళ్లీ మాస్కుల్లోకి..
కరోనా మహమ్మారి మొదలైన కొత్తలో అందరూ డాక్టర్లే. ఆ మందు పనిచేస్తుందని ఒకరు.. ఈ మందు పనిచేస్తుందని మరొకరు.. ఆయుర్వేదం నుంచి అల్లోపతి దాకా ఎన్నో ప్రయోగాలు. చివరికి వ్యాక్సిన్లు తెరపైకి వచ్చినా ఎన్నో అనుమానాలు. అన్ని అనుమానాలను, ఆటంకాలను దాటేసుకుని టీకాలు అందరికీ చేరినా.. కరోనా కొత్త రూపాంత రాలతో మళ్లీ విజృంభిస్తోంది.

అయితే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నా మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న కేసుల్లో చాలా వరకు ఒమిక్రాన్, దాని ఉప వేరియంట్లవేనని.. వాటితో లక్షణాలు తీవ్రంగా ఏమీ ఉండటం లేదని చెప్తున్నారు. జనం గుమిగూడిన చోట మాస్కు ధరించడం, శానిటైజేషన్‌ వంటి కోవిడ్‌ మార్గదర్శకాలను సరిగ్గా పాటిస్తే సరిపోతుందని స్పష్టం చేస్తున్నారు.

మన దేశంలోనూ  మెల్లగా..
దేశవ్యాప్తంగా కొద్దిరోజుల నుంచి కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత వారం రోజులుగా రోజూ 10 వేలకుపైనే కొత్త కేసులు వస్తు న్నాయి. గురువారం 13,313 కేసులు వచ్చినట్టు  కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. పాజిటివిటీ రేటు 2.8 శాతానికి పెరిగింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 83,990కి చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే 5,218 కేసులు వచ్చాయి, ఒకరు చనిపోయారు. 

  • కేరళలోని 11 జిల్లాలు, మహారాష్ట్రలోని ఐదు జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం వరకు నమోదవుతోంది. కేరళలో గురువారం ఒక్క రోజే నలుగురు మృతి చెందారు.
  • దేశ రాజధాని ఢిల్లీలో 1,934 పాజిటివ్‌ కేసులురాగా.. పాజిటివిటీ రేటు ఏకంగా 10% దాటడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
  • తమిళనాడులో 1,063 కొత్త కేసులు వచ్చాయి.
  • కర్ణాటకలో ఒక్కరోజే 858 కేసులురాగా.. అందులో సగానికి పైగా కేసులు బెంగళూరులోనే నమోదయ్యాయి.
  • తెలంగాణలో 494 కేసులు నమోదయ్యాయి.
  • ఇప్పటివరకు మూడు కరోనా వేవ్‌ల ప్రారంభంలోనూ ఇదే తరహాలో కేసులు నమోదు అయ్యాయని.. ఇది నాలుగో వేవ్‌కు ప్రారంభం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • ఇటీవలే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి, తాజాగా కేంద్ర మంత్రి çస్మృతి ఇరానీ, 
  • కేంద్ర మాజీ మంత్రి ఆజాద్‌కు కోవిడ్‌ సోకింది.

కొత్త వేరియంట్లతో..
చైనాలో మొదలైన నాటి నుంచి కరోనా ఎన్నో రూపాంతరాలు చెందింది. పదుల కొద్దీ మ్యుటేషన్లు చెందింది. అందులో ఆల్ఫా, డెల్టా వేరియంట్లు తీవ్ర ప్రభావం చూపించాయి. ఆ తర్వాత అన్నింటినీ తోసిరాజంటూ ఒమిక్రాన్‌ వచ్చింది. మెల్లమెల్లగా ఒమిక్రాన్‌లోనూ బీఏ.2, బీఏ.4, బీఏ.5 వంటి సబ్‌ వేరియంట్లు పుట్టాయి.

ఏ వేరియంటో తేల్చేందుకు...
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్త మైంది. ఒక్కసారిగా కేసుల పెరుగుదల నమోదైన జిల్లాలు, ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపాలని రాష్ట్రా లకు సూచించింది. ఏదైనా కొత్త వేరియంట్‌/ ఉప వేరియంట్‌గానీ పుట్టిందా? ఏ వేరియంట్‌ ఇలా విజృంభిస్తోందన్న దానిని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌తో తేల్చనున్నారు.

టీకా.. ఇమ్యూనిటీ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ మొదలై రెండేళ్లు కావస్తోంది. చాలా వరకు వ్యాక్సిన్ల ప్రభావశీలత (ఇమ్యూనిటీ సమ యం) గరిష్టంగా 6 నెలల–9 నెలల వరకు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక కరోనా సోకి తగ్గిపోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా దాదాపు ఇంతేకాలం ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రజల్లో కరోనా సోకి తగ్గడం, వ్యాక్సిన్‌లతో వచ్చిన ఇమ్యూనిటీ బాగా తగ్గి పోయి ఉంటుందని.. కరోనా కేసులు పెరగడా నికి ఇదీ కారణమని నిపుణులు చెప్తున్నారు. 

ప్రస్తుతం మన దేశంలో ఒమిక్రాన్‌ ఉప వేరి యంట్లు అయిన బీఏ.2, బీఏ.4, బీఏ.5 రకాలు వ్యాప్తిలో ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో బీఏ.2 వేరియంట్‌కు వ్యాప్తి సామర్థ్యం ఎక్కువని వెల్లడించాయి. ఇవి ప్రస్తుతం ప్రజల్లో నెలకొన్న ఇమ్యూనిటీ  నుంచి తప్పించుకుని, ఇన్ఫెక్షన్‌ కలిగించగలవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

ప్రపంచ దేశాల్లో పరిస్థితి ఇదీ..
కరోనా మరోసారి పంజా విసురుతుండటం తో ప్రపంచ వ్యాప్తంగా దేశాలు అప్రమత్తమ య్యాయి. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధించలేకున్నా.. ముందు జాగ్రత్త చర్యలు,నియంత్రణలను అమలు చేస్తున్నాయి.

అమెరికాలో కేసులు గణనీయంగా నమోద వుతున్నాయి. దీనితో ఆ దేశం వ్యాక్సినేష న్‌ను మరింత విస్తరించింది. తొలిసారిగా 6 నెలల నుంచి ఐదేళ్ల వయసున్న చిన్నారు లకూ వ్యాక్సిన్లు వేసేందుకు అను మతిం చింది. ఈ మేరకు ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లకు అనుమతి జారీ చేసింది.

యూరప్‌ దేశాల్లో కేసులు పెరుగుతుండ టంతో ప్రజలు జాగ్రత్తలు చేపట్టాలని ప్రభు త్వాలు హెచ్చరించాయి. ముఖ్యంగా పోర్చు గల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, గ్రీస్, నెదర్లాండ్స్, డెన్మార్క్‌ దేశాల్లో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది. ఆయా దేశాల్లో కోవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరికలూ స్వల్పంగా పెరుగుతున్నాయి.

పోర్చుగల్‌లో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. 90% పైగా బూస్టర్‌ డోసులు కూడా వేసుకున్నారు. అయినా ఇటీవల కేసులు పెరగడం, మరణాల రేటు కూడా పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే వీరిలో వృద్ధుల శాతం ఎక్కువగా ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇరాక్‌లో మరో కోవిడ్‌ వేవ్‌ మొదలైనట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, తైవాన్, బ్రెజిల్‌లో రోజుకు 30, 40 వేల కేసులు నమోదవుతున్నాయి. 

బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్, చిలీ, ఇజ్రా యెల్‌ తదితర దేశాల్లోనూ 10 వేలకుపైగా కొత్త కేసులు వస్తున్నాయి.

తైవాన్, బ్రెజిల్, రష్యా, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 


 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top