
కొత్త దందాకు తెరలేపిన యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకునేందుకు బినామీ వ్యవస్థ
తల్లిదండ్రుల తరఫున ముందే చెల్లించేస్తున్న ఫైనాన్షియర్లు
తర్వాత పేరెంట్స్ నుంచి వసూలు.. సకాలంలో చెల్లించకపోతే వడ్డీ బాదుడు
ఫైనాన్షియర్ల వ్యవస్థ చట్టబద్ధతపై తల్లిదండ్రుల్లో సందిగ్ధత
ఈ ఏడాది 25 శాతం వరకు ఫీజులు పెంచేసిన ప్రైవేటు పాఠశాలలు
మంత్రుల కమిటీ ఏర్పాటుతో సరిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడాన్ని నియంత్రిస్తామని ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది. మరోవైపు రాష్ట్ర విద్యా కమిషన్ కూడా భారీ ఫీజులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది స్కూళ్లు మొదలయ్యేలోగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తల్లిదండ్రులు భావించారు. కానీ దీనిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలూ వెలువడలేదు. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ప్రైవేటు పాఠశాలలు ఈ ఏడాది కూడా ఫీజులు భారీగా పెంచాయి.
అంతేకాదు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు ఈసారి కొత్త దందా ప్రారంభించాయి. నిర్ధారిత ఫీజులు సకాలంలో వసూలు చేసుకునే క్రమంలో ఫైనాన్షియర్లను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో తల్లిదండ్రుల తరఫున తొలుత యాజమాన్యాల బినామీలైన ఈ ఫైనాన్షియర్లే ఫీజులు చెల్లించేస్తారు. ఆ తర్వాత వీరు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తారు. గడువు లోపు చెల్లించకపోతే వడ్డీ కూడా వసూలు చేసేలా ఈ కొత్త తరహా దందాకు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు తెరలేపాయి.
పుస్తకాలు, యూనిఫాం, యాప్ల పేరిట బాదుడు
రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళలో చదువుతున్నారు. స్కూల్లో విద్యార్థి చేరేటప్పుడు ఉన్న ఫీజు ఆ మరుసటి సంవత్సరం ఉండటం లేదు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. తల్లిదండ్రుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 25 శాతం మేర ఫీజులు పెరిగాయి. సాధారణ స్కూళ్ళలో కూడా రూ.50 వేల వార్షిక ఫీజు ఉంది. ఇక కార్పొరేట్ స్కూళ్ళు ఏకంగా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయి. దీంతో పాటు పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాం, ఇతర వస్తువులన్నీ తమ వద్దే కొనాలంటున్నాయి.
ఓ కార్పొరేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థికి ఒక్క పాఠ్య పుస్తకాల వ్యయమే రూ.12 వేల వరకు ఉండటం గమనార్హం. మరోవైపు పాఠశాల సొంత ‘యాప్’ల పేరిట మరో దోపిడీకి కూడా కొన్ని యాజమాన్యాలు తెరలేపాయి. ఇందుకోసం ప్రతి విద్యార్థి నుంచి క్లాసు ఆధారంగా రూ.2,500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేస్తున్నాయి. ఫీజులు (Fees) నియంత్రిస్తామని, అడ్డగోలు దోపిడీకి కళ్లెం వేస్తామని చెప్పిన ప్రభుత్వం..ఈ దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడంతో కార్పొరేట్ స్కూళ్లు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్షియర్ల ఏర్పాటులో చట్టబద్ధతను వారు ప్రశ్నిస్తున్నారు.
చట్టం లేదు.. నియంత్రణ లేదు
ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కూడా ఇదే తరహాలో పటిష్టమైన చట్టాన్ని తేవాలని కొన్నేళ్ళుగా ఆలోచిస్తోంది. దాదాపు 11 వేల ప్రైవేటు స్కూళ్ళను దీని పరిధిలోకి తేవాలని భావించింది. ఇష్టానుసారం కాకుండా, స్కూళ్ళలోని మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు పెంచే నిబంధన విధించే యోచనలో ఉంది.
ఈ దిశగా గతంలో ఆచార్య తిరుపతిరావు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత కూడా ఈ దిశగా కార్యాచరణకు పూనుకుంది. మంత్రులతో కమిటీ వేసింది. విద్యా కమిషన్ నుంచి నివేదిక కోరింది. మంత్రుల కమిటీ ఫీజుల నియంత్రణ దిశగా అధికారులతో సంప్రదింపులు చేపట్టింది. కానీ వీటిపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత రాలేదు.
తిరుపతిరావు కమిటీ సిఫారసులు కనుమరుగు
తిరుపతిరావు కమిటీ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. ఈ మేరకు కొన్ని సిఫారసులు చేసింది. ‘ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. పది శాతం దాటితే..యాజమాన్యం ఖర్చు చేసే ప్రతి పైసా బ్యాంక్ లావాదేవీగా మాత్రమే ఉండాలి. వేతనాలు, స్కూల్లో మౌలిక వసతుల కోసం జరిపే కొనుగోళ్లు, ఇతరత్రా ఖర్చులకు సంబంధించిన లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే జరగాలి. 10 శాతానికి పైగా ఫీజు పెంచే స్కూళ్ళన్నీ విధిగా లెక్కలు చూపాలి. వీటిని ఫీజుల రెగ్యులేటరీ కమిటీ పరిశీలించాలి.
ఎక్కడ తప్పు జరిగినా భారీ జరిమానా విధించాలి. అవసరమైతే స్కూలు గుర్తింపు రద్దు చేయాలి..’అని సూచించింది. ఈ మేరకు 2018లో కమిటీ ప్రత్యేక సాఫ్ట్వేర్ను తయారు చేసింది. ఈ నేపథ్యంలో 10 శాతం లోపు ఫీజులు పెంచిన దాదాపు 4,500 స్కూళ్ళు తమ ఖర్చులను ఆన్లైన్ ద్వారా చూపాయి. అయితే ఆ తర్వాత ఈ విధానం కనుమరుగైంది. కమిటీ సిఫారసులు కఠినంగా అమలు చేస్తే చాలా వరకు స్కూళ్లు 10 శాతం లోపే ఫీజులు పెంచేందుకు అవకాశం ఉంటుందని అంచనా.
చట్టం తేవాలి
ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ సంవత్సరం ఏకంగా 25 శాతం పెంచారు. కరోనా తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్యతరగతి వారికి ఈ ఫీజులు గుదిబండలా మారుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఫీజులు నియంత్రించాలి. చిత్తశుద్ధితో చట్టాన్ని తెచ్చి అమలు చేయాలి.
– పొలుసు సంజీవరావు, హైదరాబాద్ (విద్యార్థి తండ్రి)
ప్రభుత్వ నియంత్రణ ఉండాలి
ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు ఇష్టానుసారం పెంచుతున్నారు. మరోవైపు నాణ్యత ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. కొన్ని స్కూళ్లలో టీచర్లకు జీతాలు ఇవ్వడం లేదు. వీటన్నింటిపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి.
– నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి)
వడ్డీ వసూలు చేస్తున్నారు
ఫీజులు, సకాలంలో చెల్లించకపోతే వడ్డీలు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కుల పేరిట వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశి్నస్తే..అన్ని పాఠశాలలు ఇలానే చేస్తున్నాయంటున్నారు. మీకు ఇష్టం లేకపోతే టీసీ ఇచ్చేస్తాం తీసుకెళ్లండంటున్నారు. ఇలా వసూలు చేయడం చట్ట విరుద్ధం అని చెబుతున్న అధికారులు..ఈ పాఠశాలల వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదు.
– ఆశ (విద్యార్థి తల్లి)