సాక్షి, హైదరాబాద్: కల్తీ బేకరీ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (గోల్కొండ టీమ్), గుడిమల్కాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో కేడీ కాలనీ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్న అక్రమ బేకరీ తయారీ కేంద్రం గుట్టురట్టు చేశారు. భారీ మొత్తంలో నిల్వ ఉంచిన బేకరీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

రూ.12,54,280 విలువైన ముడి పదార్థాలు, యంత్రాలను పోలీసులు సీజ్ చేశారు. తయారు చేసిన బిస్కెట్లు (ఉస్మానియా, కాజు, చాయ్, ఫ్యాన్ బిస్కెట్లు), రస్కులు, బటర్ బన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అహ్మద్ రజా లైసెన్స్ లేకుండా.. అపరిశుభ్రమైన, ప్రమాదకరమైన వాతావరణంలో తక్కువ నాణ్యత గల ముడి పదార్థాలను ఉపయోగించి ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు, బటర్ బన్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు. వీటిని నగరంలోని వివిధ కిరాణా దుకాణాలు, హోటళ్లు, కేఫ్లకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.



