కామారెడ్డి: అత్యంత చిన్న వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన మలావత్ పూర్ణకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి దేవీదాస్(50) అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన.. కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆస్పత్రిలో కోమా దశలో ఉన్న దేవీదాస్ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు స్వస్థలమైన నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం పాకాలలో నిర్వహించనున్నారు.
మలావత్ పూర్ణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ పర్వతారోహకురాలు, ఈమె 13 సంవత్సరాల 11 నెలల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, శిఖరాన్ని చేరుకున్న ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. ఆమె 2014 మే 25న ఈ ఘనత సాధించారు. పూర్ణ ఏడు ఖండాలలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించి స్ఫూర్తిగా నిలిచారు.


