చెరువులు మింగేసి... ఊరు మునకేసి..

Illigal Land Encroachments In Lake Area In Telangana - Sakshi

చిన్న వాన కురిసినా నీట మునుగుతున్న పట్టణాలు

నీళ్లు వెళ్లే దారిలేక.. రోడ్లపైనే వరద 

ఆక్రమణలకు పాల్పడుతున్న నేతలు, రియల్టర్లు 

చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం 

వరద వెళ్లిపోవాలంటే కాల్వలు కావాలి.. వాటిని పూడ్చేసి ఇళ్లు నిర్మిస్తే..? నీరు నిల్వ కావాలంటే చెరువులు ఉండాలి.. వాటిలో కాలనీలు కట్టేస్తే..? మరి వాన నీళ్లన్నీ ఎటు పోవాలి? ఎటూ పోలేకనే.. వరద రోడ్ల మీద పారుతోంది.. కాలనీల్లో ప్రవహిస్తోంది.. ఇళ్ల్లను ముంచెత్తుతోంది.. ఎనలేని నష్టాన్ని మిగుల్చుతోంది! 

ఇలా కాల్వలు, చెరువులు, కుంటలు ఆక్రమణల పాలవడం వల్లే.. చిన్న వానకే నగరాలు, పట్టణాలు వణికిపోతున్నాయి. ఒకటీరెండు చోట్ల కాదు.. రాష్ట్రంలోని చాలా నగరాలు, పట్టణాల్లో ఇదే పరిస్థితి. వివిధ పార్టీల నేతలు, అధికారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కుమ్మక్కై ఎక్కడికక్కడ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నాలాలను, చెరువులను పూడ్చేస్తున్నారు. ఆయా చోట్ల వెంచర్లు వేసి కాలనీలు కట్టేస్తున్నారు.

అక్కడ ఇళ్లు కొనుక్కుంటున్న సాధారణ జనం ఆగమాగం అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఆగస్టులో, ఈ ఏడాది జూలైలో, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తి చాలా పట్టణాలు అస్తవ్యస్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పలు పట్టణాల్లో ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. చెరువులు, నాలాల ఆక్రమణలు, వాటివల్ల ఉత్పన్నమైన పరిస్థితిని గుర్తించింది. ఈ వివరాలతో ప్రత్యేక కథనం.. –సాక్షి నెట్‌వర్క్‌

ఇది సిరిసిల్ల పట్టణ శివార్లలో కరీంనగర్‌ వెళ్లే రోడ్డులో ఉన్న కొత్త చెరువు. ఆధునీకరణ పేరిట చెరువును సగం మేర పూడ్చి.. పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. రాజీవ్‌నగర్, జేపీ నగర్, ముష్టిపల్లి, చంద్రంపేట పరిసరాల నుంచి వచ్చే వరదను కొత్త చెరువులోకి మళ్లించారు. ఓవైపు చెరువు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి, మరోవైపు వరద చేరిక పెరిగిపోయి.. కాస్త గట్టివాన పడితే మత్తడి దూకుతున్న పరిస్థితి నెలకొంది.

ఫలితంగా శాంతినగర్‌ ప్రాంతం జల దిగ్బంధం అవుతోంది. ఇక కొత్త చెరువులోకి మురికినీరు చేరకుండా ఉండాలని మురికినీటి శుద్ధి (ఈటీపీ) ప్లాంటును ఏర్పాటు చేశారు. అది లోపభూయిష్టంగా ఉండటంతో మురికినీరు సిరిసిల్ల పట్టణ వీధులను ముంచెత్తుతోంది. కొత్తచెరువు మత్తడి నీళ్లు వెళ్లేందుకు గతంలో కాల్వ ఉండేది. దాన్ని కొందరు కబ్జా చేసి, ఇళ్లు, ఇతర సముదాయాలు నిర్మించారు. దీనితో మత్తడి వరద రోడ్డుపై ప్రవహిస్తూ.. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. 

నిర్మల్‌ బస్టాండ్‌ పక్కనే ఉన్న ధర్మసాగర్‌ చెరువులో వాకింగ్‌ ట్రాక్‌ పేరిట ఏర్పాటు చేసిన కట్ట ఇది. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తామంటూ పోసిన ఈ కట్ట.. చెరువు ఎఫ్‌టీఎల్‌ మధ్యలోనే ఉండటం గమనార్హం. దీని అవతల మరింత చెరువు, ఎఫ్‌టీఎల్‌ పరిధి భూములు ఉన్నాయి. కానీ ఆ భూములు చెరువు పరిధిలోవి కావని, ఎఫ్‌టీఎల్‌ పరిధి ఆ కట్ట వద్దే ముగిసింది అన్నట్టుగా చూపుతున్నారు.

ఆ ప్రాంతంలో ప్రముఖుల భూములు ఉండటంతోనే.. ఇలా కట్ట నిర్మించారన్న ఆరోపణలున్నాయి. కొందరు పెద్దలు చెరువుల సమీపంలోని భూములను కొనుగోలు చేస్తూ.. మెల్లగా చెరువుల భూములను చెరబడుతున్నారని స్థానికులు చెప్తున్నారు. 

చెరువు మధ్యలో రోడ్డు.. 
నీళ్ల మధ్యలోకి వెళ్తున్నట్టుగా ఉన్న ఈ రోడ్డు.. ఖమ్మం పట్టణశివార్లలోని ఖానాపురం చెరువులోనిది. ఖమ్మం కార్పొరేషన్‌గా మారినప్పుడు శివార్లలోని ఖానాపురం హవేలి పంచాయతీని విలీనం చేశారు. నాటి నుంచే ఇక్కడి చెరువుపై ఆక్రమణ దారుల కన్ను పడింది. ఖానాపురం చెరువు పూర్తి విస్తీర్ణం సుమారు 133 ఎకరాలు. సర్వే నంబర్‌ 13లో 75.23 ఎకరాల మేర చెరువు ఉండగా.. ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని 57.17 ఎకరాల్లో పట్టా భూములు ఉన్నాయి. గతంలో ఈ చెరువు ద్వారా 200 ఎకరాలకు సాగునీరు అందేది. ఇప్పుడు ఆక్రమణలు పెరిగి కుంచించుకుపోతోంది.

ప్రధాన చెరువులోనే రెండెకరాల వరకు కబ్జాలుకాగా.. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. నిజానికి చెరువులో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని భూముల్లో వ్యవసాయం చేసుకోవచ్చు. కానీ ఏకంగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేశారు. ఓ రియల్‌ వెంచర్‌కు దారి కోసం ఇటీవల చెరువు మధ్యలోంచి మట్టిరోడ్డు వేశారు. జనం ఫిర్యాదులు చేయడంతో అధికారులు దానిని తవ్వించేశారు. ఇలాంటి ఆక్రమణలు మరెన్నో ఉన్నాయని స్థానికులు అంటున్నారు. 

వరంగల్‌ శివనగర్‌లో కబ్జాల పాలై ఇరుకుగా మారిపోయిన శివనగర్‌ నాలా ఇది. ఇదొక్కటే కాదు. వరంగల్‌లో ప్రధాన నాలాలు అయిన నయీంనగర్‌ నాలా, బొందివాగు నాలా సహా అన్నీ కూడా ఆక్రమణలతో కుదించుకుపోయాయి. దీనితో భారీ వర్షాలు పడినప్పుడు వరద అంతా రోడ్ల మీద ప్రవహిస్తోంది. 

ఇది హన్మకొండలోని గోపాల్‌పూర్‌ ప్రాంతం. నిండుగా ఇళ్లతో కనిపిస్తున్న ఇక్కడ 25 ఏళ్ల కింద ఓ చెరువు ఉండేది. ఇదొక్కటే కాదు గోపాలపురం, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఆరు చెరువులు ఆక్రమణల పాలయ్యాయి. మెల్లగా నిర్మాణాలు
 వెలుస్తూ.. ఇప్పుడు చెరువుల ఆనవాళ్లే లేకుండా పోయాయి. దీంతో వానలు పడ్డప్పుడల్లా కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. 

‘గొలుసుకట్టు’తెంపేశారు!

రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్‌. కాకతీయ రాజులు ఎంతో ముందు చూపుతో ఇక్కడ గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. ఒక్కో చెరువు నిండిన కొద్దీ నీళ్లు దిగువన ఉన్న చెరువులోకి వెళ్తూ ఉండేలా అనుసంధానం చేశారు. ఇప్పుడా చెరువులు చాలా వరకు మాయమయ్యాయి. మిగతా చెరువులు, నాలాలు కూడా సగానికిపైగా కబ్జాల పాలయ్యాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలో 823, వరంగల్‌ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో 190 చెరువులు ఉన్నట్టు నూతన మాస్టర్‌ ప్లాన్‌లో చూపించారు.

ఈ చెరువుల్లో సగానికిపైగా కుదించుకుపోయాయి. వందలకొద్దీ కాలనీలు వెలిశాయి. ఏ చిన్న వాన పడినా అవన్నీ నీట మునుగుతున్నాయి. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం.. మున్సిపల్‌ శాఖ, అన్ని జిల్లాలు, కుడా, బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులతో వేసిన లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీలు నామ్‌కేవాస్తేగా మారాయి. అంతేకాదు అధికారులు నోటిఫై చేసి, ఆయా వెబ్‌సైట్లలో పెట్టిన చెరువుల లెక్కలకు.. వాస్తవంగా ఉన్న చెరువులు, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లు, ఇతర డేటాకు పొంతనే లేదని స్థానికులు మండిపడుతున్నారు. 

ఒక్క వానతో ఆగమాగం 
గత ఏడాది ఆగస్టులో వరంగల్‌లో 27 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అసలే చెరువులు, నాలాలు అన్నీ కబ్జాలు, ఆక్రమణల పాలై ఉండటంతో.. భారీ స్థాయిలో వచ్చిన వరద అంతా నగరంలోనే నిలిచిపోయింది. 40 కాలనీలు పూర్తిగా నీటమునిగాయి, వందల కొద్దీ కాలనీలు జలమయం అయ్యాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రాణనష్టమూ నమోదైంది.

దీంతో అధికారులు వరంగల్‌లో చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ప్రకటించారు. క్షుణ్నంగా సర్వే చేసి చెరువుల ఎఫ్‌టీఎల్, ఇతర హద్దులు తేల్చాలని.. వాటి పరిధిలో ఎన్ని ఇండ్లు, ఇతర నిర్మాణాలు ఉన్నాయో గుర్తించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలూ చేపట్టిన దాఖలాలు లేవు. 

కేటీఆర్‌ ఆదేశించినా.. 
గత ఏడాది వరదలు ముంచెత్తిన సమయంలో మంత్రి కేటీఆర్‌ వరంగల్‌లో పర్యటించారు. మళ్లీ వరదల సమస్య రాకుండా చూడాలని, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే కూల్చి వేయాలని ఆదేశించారు. కానీ ఆక్రమణల కూల్చివేతలు, నాలాల విస్తరణ నామమాత్రంగానే మిగిలిపోయింది. తాజాగా భారీ వర్షాలు కురవడంతో సుమారు 33 కాలనీలు జలమయం అయ్యాయి.

రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్‌. కాకతీయ రాజులు ఎంతో ముందు చూపుతో ఇక్కడ గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. ఒక్కో చెరువు నిండిన కొద్దీ నీళ్లు దిగువన ఉన్న చెరువులోకి వెళ్తూ ఉండేలా అనుసంధానం చేశారు. ఇప్పుడా చెరువులు చాలా వరకు మాయమయ్యాయి. మిగతా చెరువులు, నాలాలు కూడా సగానికిపైగా కబ్జాల పాలయ్యాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలో 823, వరంగల్‌ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో 190 చెరువులు ఉన్నట్టు నూతన మాస్టర్‌ ప్లాన్‌లో చూపించారు.

ఈ చెరువుల్లో సగానికిపైగా కుదించుకుపోయాయి. వందలకొద్దీ కాలనీలు వెలిశాయి. ఏ చిన్న వాన పడినా అవన్నీ నీట మునుగుతున్నాయి. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం.. మున్సిపల్‌ శాఖ, అన్ని జిల్లాలు, కుడా, బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులతో వేసిన లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీలు నామ్‌కేవాస్తేగా మారాయి. అంతేకాదు అధికారులు నోటిఫై చేసి, ఆయా వెబ్‌సైట్లలో పెట్టిన చెరువుల లెక్కలకు.. వాస్తవంగా ఉన్న చెరువులు, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లు, ఇతర డేటాకు పొంతనే లేదని స్థానికులు మండిపడుతున్నారు. 

ఒక్క వానతో ఆగమాగం 
గత ఏడాది ఆగస్టులో వరంగల్‌లో 27 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అసలే చెరువులు, నాలాలు అన్నీ కబ్జాలు, ఆక్రమణల పాలై ఉండటంతో.. భారీ స్థాయిలో వచ్చిన వరద అంతా నగరంలోనే నిలిచిపోయింది. 40 కాలనీలు పూర్తిగా నీటమునిగాయి, వందల కొద్దీ కాలనీలు జలమయం అయ్యాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రాణనష్టమూ నమోదైంది.

దీంతో అధికారులు వరంగల్‌లో చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ప్రకటించారు. క్షుణ్నంగా సర్వే చేసి చెరువుల ఎఫ్‌టీఎల్, ఇతర హద్దులు తేల్చాలని.. వాటి పరిధిలో ఎన్ని ఇండ్లు, ఇతర నిర్మాణాలు ఉన్నాయో గుర్తించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలూ చేపట్టిన దాఖలాలు లేవు. 

కేటీఆర్‌ ఆదేశించినా.. 
గత ఏడాది వరదలు ముంచెత్తిన సమయంలో మంత్రి కేటీఆర్‌ వరంగల్‌లో పర్యటించారు. మళ్లీ వరదల సమస్య రాకుండా చూడాలని, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే కూల్చి వేయాలని ఆదేశించారు. కానీ ఆక్రమణల కూల్చివేతలు, నాలాల విస్తరణ నామమాత్రంగానే మిగిలిపోయింది. తాజాగా భారీ వర్షాలు కురవడంతో సుమారు 33 కాలనీలు జలమయం అయ్యాయి.

హన్మకొండ హంటర్‌రోడ్‌ న్యూశాయంపేట లో 150 ఎకరాల కోమటి చెరువులో సుమా రు 15–20 ఎకరాలు కబ్జాల పాలైంది. 
కాజీపేట బంధం చెరువు 57 ఎకరాల విస్తీర్ణం ఉండేది. ఇప్పుడు సగమే మిగిలింది. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నా.. కార్పొరేషన్‌ వారు ఇంటి నంబర్లు ఇస్తున్నారు. 
► హన్మకొండ వడ్డేపల్లి చెరువు 324 ఎకరాలు ఉంటుంది. ఇందులో సుమారు 40 ఎకరాల స్థలం అన్యాక్రాంతమైంది. 
► గొర్రె కుంట కట్టమల్లన్న చెరువు 21.24 ఎకరాలు ఉండేది. ఇందులో ఎనిమిది ఎకరాల దాకా ఆక్రమణల పాలైంది. చెరువులోనే భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. 
► వరంగల్‌కు కీలకమైన భద్రకాళి చెరువు విస్తీర్ణం 336 ఎకరాలుకాగా.. 30 ఎకరాలు ఇప్పటికే కబ్జా అయినట్టు అంచనా. 
► హాసన్‌పర్తి పెద్దచెరువు 157 ఎకరాలు ఉండాలి. ఇటీవల కొందరు.. పట్టాభూమి పేరుతో చెరువు పరిధిలోని 30 ఎకరాలను చదును చేయడం వివాదాస్పదమైంది. 
► ములుగు రోడ్‌లోని కోట చెరువు 159 ఎకరాల విస్తీర్ణం ఉండేది. సుమారు 30 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైనట్లు రెవెన్యూ శాఖ తేల్చింది. 
► చిన్నవడ్డేపల్లి చెరువు విస్తీర్ణం 100 ఎకరాలుకాగా.. 20 ఎకరాల వరకు ఆక్రమణలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 
► 170 ఎకరాల మామునూరు పెద్ద చెరువు లో 40 ఎకరాలు ప్రైవేటు చెరలోనే ఉంది. 
► పాతబస్తీ ఉర్సు రంగసముద్రం (ఉర్సు చెరువు) 126 ఎకరాల్లో ఉండగా.. సుమారు 26 ఎకరాల వరకు అన్యాక్రాంతమైంది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో పెద్ద సంఖ్యలో నిర్మాణాలు సాగుతున్నాయి. 
► అమ్మవారిపేట దామెర చెరువు విస్తీర్ణం 134 ఎకరాలు. ఇక్కడ రియల్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారు 20 ఎకరాల వరకు మాయమైంది. 
► తిమ్మాపూర్‌ శివారు బెస్తం చెరువును స్మృతి వనంగా మార్చే ప్రతిపాదన ఉంది. 6 ఎకరాల విస్తీర్ణం ఉండే ఈ చెరువులో.. సగం దాకా ఆక్రమణలోనే ఉంది.
వరంగల్‌ పెరకవాడలో ఓ స్థానిక ప్రజాప్రతినిధి సోదరుడు నాలాపైనే కట్టిన భవనం

ఖమ్మం.. ఆక్రమణలకు గుమ్మం
ఖమ్మం పట్టణం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు పరిస్థితికి అద్దం పడుతున్న చిత్రాలివి. 2006 నాటితో పోలిస్తే.. ప్రస్తుతం చెరువు ఎంతగా కుంచించుకుపోయిందో ఈ ఫొటోల్లో స్పష్టంగా తెలిసిపోతుంది. నిజానికి ఈ చెరువు పూర్తిస్థాయి విస్తీర్ణం 163 ఎకరాలు. పాకబండ బజార్, ఖానాపురం హవేలీ రెవెన్యూ పరిధిలోని 66, 234 సర్వే నంబర్లలో విస్తరించి ఉన్న ఈ చెరువులో ఆరేడు ఎకరాలకు పైనే కబ్జాల పాలైంది.

ప్రైవేట్‌ వ్యక్తులు ఆక్రమించుకోవడమే కాదు ప్రభుత్వ భవనాలు కూడా చెరువు భూముల్లో వెలిశాయి. కొందరు చెరువుల పక్కనే ఉన్న భూములు కొని, ఆ సర్వే నంబర్లతోనే చెరువు భూములకు పట్టాలు చేయించుకున్నారు. తీరా ఇన్నేళ్ల ఆక్రమణలను కూల్చేందుకు అధికారులు వెళ్తే.. కోర్టు నుంచి తెచ్చుకున్న స్టేలు, తామే హక్కుదారులమంటూ పత్రాలు చూపిస్తుండటంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. 

భూముల రేట్లు పెరిగి.. కబ్జాదారుల కన్నుపడి 
ఖమ్మం పట్టణం 2012 అక్టోబర్‌లో కార్పొరేషన్‌ హోదా పొందింది. అప్పటి నుంచి పట్టణం విస్తరణ, భూముల రేట్లు బాగా పెరిగాయి. పట్టణంలోని లకారం చెరువు చుట్టుపక్కల చదరపు గజం రూ.30 వేలకుపైనే పలుకుతుండటంతో కబ్జా దారుల కన్ను పడింది. మెల్లమెల్లగా ఆరేడు ఎకరాలకుపైనే ఆక్రమణలు వెలిశాయి. గతంలో చెరువు పరిధిలో భూమిని లీజుకు ఇచ్చిన ఉద్దేశం కూడా మూలకుపడి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి.

చివరికి 2015లో చెరువు ఆధునీకరణ పనులు చేపట్టడంతో ఆక్రమణలు ఆగాయి. కానీ ఇప్పటికే కబ్జాల పాలైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీనికితోడు చెరువుల్లోని నీళ్లు వెళ్లే కాల్వలు, నాలాలు కూడా కబ్జా కావడంతో.. భారీ వర్షాలు కురిసినప్పుడు ఇండ్లు నీట మునుగుతున్నాయి. 

నిర్మల్‌.. కబ్జాల ఖిల్లా! 
నిర్మల్‌ జిల్లా కేంద్రం చుట్టూ గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. 450 ఏళ్ల క్రితమే కాకతీయుల స్ఫూర్తితో స్థానిక పాలకుడు నిమ్మనాయుడు, ఆయన తర్వాతివారు వీటిని తవ్వించారు. ప్రస్తుతం 11 చెరువులు ఉనికిలో ఉండగా.. దాదాపు అన్నింటిలో ఆక్రమణలు ఉన్నాయి. ఈ చెరువుల మధ్య నీళ్లు తరలిపోయే కాల్వలు కూడా కబ్జాల పాలయ్యాయి. ఈ కారణంగానే భారీ వర్షాలు పడ్డప్పుడల్లా చెరువుల్లోకి చేరాల్సిన నీళ్లు.. కాలనీలు, ఇండ్లను ముంచెత్తుతున్నాయి.

ఈ ఏడాది జూ లైలో భారీ వర్షాలతో పలు చెరువులు పూర్తిగా నిండాయి. సమీప కాలనీలు నీట మునిగాయి. కొందరు పట్టాభూములుగా చెప్పుకొంటున్న భూములు కూడా ఇప్పటికీ చెరువు నీటిలో మునిగే ఉన్నాయి. అవన్నీ ఆక్రమణలేనని.. అధికారులు పట్టించుకోకున్నా వానలతో బయటపడిందని స్థానికులు అంటున్నారు. నిజానికి నిర్మల్‌ గొలుసుకట్టు చెరువుల ఆక్రమణలపై స్థానిక న్యాయవాది ఒకరు మూడేళ్ల కిందటే హైకోర్టులో పిల్‌ వేశారు.

దానిపై కొద్దినెలల కింద జరిగిన విచారణ సందర్భంగా.. చెరువుల ఆక్రమణలపై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలను గుర్తించి తొలగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. దాంతో కొంతమేర తొలగింపు చేపట్టినా.. ఇంకా భారీగా కబ్జాలు అలాగే ఉన్నాయి. 

ఆక్రమణలపై టాస్క్‌ఫోర్స్‌ వేశాం 
ఖమ్మం జిల్లాలో చెరువులు, కుంటలు, ఇతర నీటివనరుల ఆక్రమణలపై టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటైంది. ఎక్కడికక్కడ పరిశీలన జరిపి.. కేసులు పెడుతున్నాం. పూర్తిస్థాయి నివేదికలు సిద్ధమయ్యాక ప్రభుత్వానికి అందజేస్తాం. 

– శంకర్‌నాయక్, సీఈ, జలవనరుల శాఖ, ఖమ్మం 

చెరువుల ఆక్రమణలు, అధికార యంత్రాంగం ఆలోచన లేని నిర్ణయాల ఫలితంగా సిరిసిల్ల పట్టణం వరదను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి భారీ వర్షాలకు సిరిసిల్లలోని 20 వరకు కాలనీలు నీట మునిగాయి. కొన్ని కాలనీలు అయితే ఏ చిన్నపాటి వాన పడినా జలమయం అవుతున్నాయి. పట్టణ జనాభా లక్షకుపైగా ఉండగా.. అందులో 48వేల మంది వరకు ఇలా ముంపును ఎదుర్కొంటున్నారు. 

► 1990 దశకంలో సిరిసిల్లలోని రాయిని చెరువును పూర్తిగా పూడ్చేసి.. సుమారు పది వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దీనితో వరద వెళ్లే దారి లేక.. చిన్నపాటి వానలు కురిసినా బీవై నగర్, సుందరయ్యనగర్, తారకరామానగర్, ఇందిరానగర్‌లు మునుగుతున్నాయి. 
మానేరువాగు నుంచి వచ్చే మంచినీటి కాల్వ ఉదారువాగు ఇప్పుడు మురికి కూపంగా మారింది. కాల్వ స్థలాలు కబ్జాల పాలయ్యాయి. 
చెరువుల ఆక్రమణలు, అధికార యంత్రాంగం ఆలోచన లేని నిర్ణయాల ఫలితంగా సిరిసిల్ల పట్టణం వరదను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి భారీ వర్షాలకు సిరిసిల్లలోని 20 వరకు కాలనీలు నీట మునిగాయి. కొన్ని కాలనీలు అయితే ఏ చిన్నపాటి వాన పడినా జలమయం అవుతున్నాయి. పట్టణ జనాభా లక్షకుపైగా ఉండగా.. అందులో 48వేల మంది వరకు ఇలా ముంపును ఎదుర్కొంటున్నారు. 
► 1990 దశకంలో సిరిసిల్లలోని రాయిని చెరువును పూర్తిగా పూడ్చేసి.. సుమారు పది వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దీనితో వరద వెళ్లే దారి లేక.. చిన్నపాటి వానలు కురిసినా బీవై నగర్, సుందరయ్యనగర్, తారకరామానగర్, ఇందిరానగర్‌లు మునుగుతున్నాయి. 
► మానేరువాగు నుంచి వచ్చే మంచినీటి కాల్వ ఉదారువాగు ఇప్పుడు మురికి కూపంగా మారింది. కాల్వ స్థలాలు కబ్జాల పాలయ్యాయి.  

చదవండి: GHMC: కోటికి చేరువలో టీకా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top