సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలల ముందస్తు ఫీజు వసూలు విషయంలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పాఠశాలల్లో ముందస్తు ఫీజు వసూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఇటువంటి చర్యలు అనుచితం, ఏకపక్షమైనవే కాకుండా వాణిజ్యపరంగా విద్యను మలచరాదనే న్యాయసూత్రాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు మానవహక్కుల సంఘం ఛైర్మన్ షమీమ్ అక్తర్ అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్లోని ఒక ప్రైవేట్ పాఠశాల 2026–2027 విద్యా సంవత్సరానికి 50% ఫీజును ముందుగానే వసూలు చేయడం, అలాగే పుస్తకాలు మరియు యూనిఫాంల కోసం ముందస్తు చెల్లింపులు కోరడం వంటి అంశాలపై మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు నమోదైంది. దీనిని విచారించిన హ్యుమన్ రైట్స్ కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విద్య హక్కు ప్రాథమిక హక్కు కాగా, దానిని లాభాపేక్షతో నిర్వహించరాదని సంఘం పునరుద్ఘాటించింది.
తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారం, అలాగే నిర్దిష్ట విక్రేతల వద్ద నుంచే పుస్తకాలు, యూనిఫాంల కొనుగోలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం వల్ల పారదర్శకత లోపిస్తున్న అంశాలను గమనించిన సంఘం, మెడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాధికారి తగిన చర్యలు తీసుకోవాలని, ఫీజు నియంత్రణ నిబంధనల ప్రకారం విడతలవారీగా ఫీజులు వసూలు చేసే విధానాన్ని అమలు చేయాలని సిఫార్సు చేసింది.
ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చట్టం, 1993 ప్రకారం నిర్ణీత గడువులోగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారిని సంఘం ఆదేశిస్తూ, ఈ వ్యవహారాన్ని ముగించింది.


