కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వీడండి.. 

DR Seema Rahman Interview On Corona Vaccine - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వీడనాడి అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని బంజారాహిల్స్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి షీమా రహ్మాన్‌ పేర్కొన్నారు. రకరకాలు ఊహాగానాలతో చాలా మంది వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ముందుకురావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. ‘వ్యాక్సిన్‌ వేయించుకుంటే లాభాలు.. ఎక్కడెక్కడ వేస్తారు.. ఎవరు వేయించుకోవాలి’ అనే అంశంపై డాక్టర్‌ షీమా రహ్మాన్‌తో ‘సాక్షి’ ముఖాముఖి. 

ఏ వయసు వారు అర్హులు..?  
కోవిడ్‌–19 ఉధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 45 ఏళ్లు వయసు దాటిని వారంతా కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవాలి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఈ వ్యాక్సిన్‌ను వేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.  

కేసులు పెరుగుతున్నాయా..?  
వారం రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మళ్లీ కరోనా విజృంభిస్తుంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 3 వరకు ప్రతిరోజూ రెండు కేసులు నమోదైతే మార్చి 27 నుంచి ప్రతిరోజూ పదికిపైగా కేసులు నమోదవుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఎక్కువ కేసులు నమోదు కావడం చూస్తే మళ్లీ కరోనా విజృంభిస్తుందనే చెప్పాలి.  

ఎక్కడెక్కడ వ్యాక్సిన్‌ వేస్తున్నారు..?  
అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలతో పాటు గుర్తించిన ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ వ్యాక్సిన్‌ వేస్తున్నాం. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మాత్రం ఉచితంగా వ్యాక్సిన్‌ వేయడం జరుగుతుంది. 

రోజుకు ఎంత మందికి వేస్తారు..?  
ఒక్కో ఆరోగ్య కేంద్రంలో ప్రతి రోజూ వంద మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే చాలా మందికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ వేస్తున్న విషయం తెలియడం లేదు. ఉచితంగా ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ వేస్తున్నాం. 

అవగాహన కల్పిస్తున్నారా..? 
నిత్యం వైద్య సిబ్బందితో పాటు ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లను కలుపుకొని వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పిస్తున్నాం. ఉచితంగా వ్యాక్సిన్‌ వేస్తున్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం.  

కరోనా పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  
ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలి. శానిటైజేషన్‌ చాలా ముఖ్యం. పరిసరాలతో పాటు స్వీయా శుభ్రత పాటించడం ఎంతో ముఖ్యం. ప్రతిఒక్కరూ విధిగా ఇతరులకు కూడా మాస్క్‌ ధరించాలని అవగాహన కలిగించడంతో పాటు భౌతికదూరంపై చైతన్యం తీసుకురావాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top