Congress Party: 100 సీట్లలో ఒక్కో పేరే!.. స్క్రీనింగ్‌ కమిటీ నిర్ణయం | Congress Screening Committee Shortlist Assembly Candidates - Sakshi
Sakshi News home page

Congress Party: 100 సీట్లలో ఒక్కో పేరే!.. స్క్రీనింగ్‌ కమిటీ నిర్ణయం

Sep 7 2023 9:06 AM | Updated on Sep 7 2023 10:04 AM

Congress Screening Committee Assembly candidates Selection - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖరారు ప్రక్రియను దాదాపుగా రాష్ట్రంలోనే పూర్తి చేయాలని.. 100 నియోజకవర్గాలకు ఒక్కో అభ్యర్థి పేరుతోనే అధిష్టానానికి జాబితాలను పంపాలని కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ నిర్ణయించింది. బుధవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశమై ఈ అంశంపై చర్చించింది.

కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌తోపాటు సభ్యులు మాణిక్‌రావ్‌ ఠాక్రే, సిద్ధిఖీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి విక్ర మార్క, మన్సూర్‌ అలీఖాన్, విష్ణునాథ్, రోహిత్‌చౌదరి తదితరులు ఇందులో పాల్గొన్నారు. మరో సభ్యుడు, గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. ఈ సమావేశంలో భాగంగా 119 అసెంబ్లీ  నియోజకవర్గాల్లో టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు, ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ (పీఈసీ) ఇచ్చిన నివేదికలను నేతలు పరిశీలించారు. 

ఇక్కడే కసరత్తు పూర్తి చేద్దాం.. 
తొలుత స్క్రీనింగ్‌ కమిటీలో రాష్ట్రం నుంచి సభ్యులుగా ఉన్న రేవంత్, ఉత్తమ్, భట్టి ఆయా చోట్ల టికెట్ల ఖరారు ప్రాథమ్యాలను వివరించారు. అనంతరం రాష్ట్రంలో సామాజిక వర్గాల వారీగా టికెట్ల కేటాయింపు ఆవశ్యకత, మహిళలకు కేటాయించాల్సిన సీట్లు, యువతకు టికెట్లు, పార్టీ అనుబంధ సంఘాలకు అవకాశం తదితర అంశాలపై చర్చించారు. ఎక్కడెక్కడ ఏ కేటగిరీ నాయకులకు అవకాశం కల్పించగలమనేదానిని పరిశీలించారు.

ఏఐసీసీకి పంపే జాబితాను అన్ని కోణాల్లో క్షుణ్నంగా నిర్ధారించి పంపాలని, మెజార్టీ స్థానాల్లో ఒక్కటే పేరు సూచించేలా కసరత్తును ఇక్కడే పూర్తి చేయాలని భేటీలో నిర్ణయానికి వచ్చారు. దాదాపు రెండు గంటలకుపైగా ఈ సమావేశం జరిగినా.. నియోజకవర్గాల వారీగా కసరత్తు పూర్తి కాకపోవడంతో త్వరలో మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. భేటీ ముగిశాక మురళీధరన్, ఠాక్రే, భట్టి మీడియాతో మాట్లాడారు. 

మరో రెండు వారాలు పడుతుంది 
‘‘అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. సమావేశంలో భాగంగా అన్ని అంశాలపై నిశితంగా పరిశీలన చేశాం. కసరత్తు పూర్తయ్యేందుకు మరో రెండు వారాల సమయం పడుతుంది. మెజార్టీ స్థానాలకు ఒక్కటే పేరు పంపాలని నిర్ణయించాం. త్వరలోనే మరోమారు సమావేశం జరుగుతుంది.’’ 
– కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ 

ఇంకా చర్చించాల్సినవి చాలా ఉన్నాయి 
‘‘పీఈసీ సమావేశంలో వచి్చన అభిప్రాయాలు, పీఈసీ ఇచి్చన నివేదికపై సుదీర్ఘంగా చర్చించాం. పీఈసీ సభ్యులతోపాటు డీసీసీలు, మాజీ మంత్రులు, సీనియర్‌ నేతల సలహాలను పరిగణనలోకి తీసుకుంటాం. స్క్రీనింగ్‌ కమిటీలో ఇంకా చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. 
– పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే

ప్రామాణికాలపై చర్చించాం 
స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ రాష్ట్ర నేతల దగ్గర అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ అభిప్రాయాలపై సమావేశంలో మాట్లాడాం. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి ప్రామాణికాలు అనుసరించాలన్న దానిపై చర్చించాం. త్వరలో మరోమారు సమావేశమై కసరత్తు పూర్తిచేస్తాం. 
– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  


ఎల్‌బీ స్టేడియంలో ఉత్తమ్‌కుమార్‌తో మాట్లాడుతున్న కేసీ వేణుగోపాల్‌. చిత్రంలో మాణిక్‌రావ్‌ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, పొంగులేటి  తుక్కుగూడలో కాంగ్రెస్‌ సభ
– వివరాలు 2లో


తుక్కుగూడలో కాంగ్రెస్‌ సభ
– వివరాలు 2లో 

Advertisement
 
Advertisement
Advertisement