– సన్నాహక సమావేశంలో కోట వెంకటేశ్వరరెడ్డి వెల్లడి
కొరుక్కుపేట: తమిళనాడు రాష్ట్రం చైన్నెలో ఆలిండియా ఘంటసాల చైతన్యవేదిక 16వ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్టు ఆ వేదిక అధ్యక్షుడే కోట వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఈమేరకు చైన్నెనగరం, పెరియమెట్లోని తిరువేంగడం మొదటి వీధిలో ఉన్న శ్రీతిరుమల లాడ్జి ఆవరణలో ఆలిండియా చైతన్య వేదిక 16వ జాతీయ మహాసభల సన్నాహక సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ప్రముఖ గాయకులు, ఘంటసాల అభిమాని ఎంఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. గాయకులు కిడాంబి లక్ష్మీకాంత్తోపాటు, చైన్నెలోని ఘంటసాల గాయకులు, అభిమానులతో పరిచయ కార్యక్రమాలు చేపట్టారు. కోట వెంకటేశ్వరరెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రధాన ప్రసంగం చేశారు. మహాసభలను చైన్నె వేదికగా నిర్వహించనున్నట్టు ఈ సన్నాహక సమావేశం నిర్ణయించిందని అన్నారు. రానున్న మే నెలలో మరొక విస్తృత సన్నాహక సమావేశం జరుగుతుందన్నారు. మధురగాయకులు ఘంటసాల అభిమానులు ఇందులో పాల్గొని తమ విలువైన అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. ప్రత్యేకించి ఘంటసాల అభిమాని, జనని సంస్థ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య తమ ప్రోత్సాహం ఉంటుందని తెలియజేశారని, వారికి తమ వేదిక తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.


