మీసై మురుక్కు– 2 చిత్రంలో హిప్హాప్ తమిళా
తమిళసినిమా: ప్రైవేట్ ఆల్బమ్ల ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయిన హిప్హాప్ తమిళా ఆ తరువాత సంగీతదర్శకుడిగా చిత్ర రంగప్రవేశం చేసి పేరు తెచ్చుకున్నారు. ఆపై హీరోగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఈయన హీరోగా నటించిన మీసై మురుక్కు చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. 2017లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా మీసై మురుక్కు చిత్రానికి సీక్కెల్ను రూపొందిస్తున్నారు. ఇందులోనూ హిప్హాప్ తమిళా హీరోగా నటిస్తూ, కథ, కథనం, దర్శకత్వం, సంగీతం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. బ్రెన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత ఏసీఎస్ అరుణ్కుమార్, నటి కుష్భూ సుందర్కు చెందిన అవ్నీ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ సుబ్రమణియం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇందులో నటి కూతిక శర్మ, చైత్ర జే.ఆచార్, యోగిబాబు, కరుణాస్, హర్షద్ఖాన్, ఆడుగళం నరేన్, నాజర్, ర మ్య రంగనాథన్, షారా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇటీవల విడుదల చేసిన చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్, టీజర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. అదే విధంగా ఆరా పత్తుకు పత్తు అనే పల్లవితో సాగే పాటను విడుదల చేయగా సంగీత ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. కాగా తాజాగా పప్పాళి పళమే అనే పల్లవితో సాగే పాటను బుధవారం విడుదల చేసినట్లు చెప్పారు. గానా వినోద్, గానా తరణి,హిప్హాప్ తమిళా కలిసి పాడిన ఈ పాట గానా స్టైల్లో సాగే ఈ పాట ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోందన్నారు. కాగా మీసైమురుక్కు –2 చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు.


