క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Apr 7 2026 7:43 AM | Updated on Apr 7 2026 7:43 AM

తిరుచ్చిలో 307 మంది

రైతులకు సమన్లు

అన్నానగర్‌: జాతీయ దక్షిణ భారత నదుల అనుసంధాన రైతు సంఘం అధ్యక్షుడు అయ్యక్కన్ను నేతత్వంలో 300 మందికి పైగా రైతులు, తమ వివిధ డిమాండ్లను నెరవేరుస్తూ గత ఏడాది నవంబర్‌ 18న ఢిల్లీలో నిరసన తెలిపేందుకు రైలులో బయలుదేరారు. ఆ సమయంలో అకస్మాత్తుగా నాగ్‌పూర్‌ రైల్వే స్టేషనన్‌లో దిగి నిరసన చేపట్టారు. ఈ విషయమై, రైల్వే రక్షణ దళం పోలీసులు అయ్యక్కన్ను సహా 307 మంది రైతులపై కేసు నమోదు చేశారు. దీని తర్వాత, మధ్యప్రదేశ్‌ రైల్వే పోలీసులు ఆదివారం అయ్యక్కన్ను ఇంటికి వెళ్లి, విచారణ నిమిత్తం వ్యక్తిగతంగా హాజరు కావాలని అతనికి, 307 మంది రైతులకు సోమవారం సమన్లు జారీ చేశారు.

పుదుచ్చేరి కాంగ్రెస్‌ అభ్యర్థి ఫ్యాక్టరీలో ఐటీ దాడులు

తిరువొత్తియూరు: పుదుచ్చేరి, ముత్యాల్‌ పేట నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఈరం రాజేంద్రన్‌ పోటీ చేస్తున్నారు. ఆయనకు చెందిన దోమల నివారణ కాయిల్స్‌ ఫ్యాక్టరీ తట్టాంచావడి ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో, తట్టాంచావడి ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ఉన్న దోమల నివారణ కాయిల్స్‌ ఫ్యాక్టరీలో సోమ వారం ఉదయం పారామిలిటరీ బలగాల భద్రతతో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన తనిఖీలు 5 గంటల కంటే ఎక్కువ సమయం కొనసాగుతున్నాయి. నగదు పంపిణీ వంటి ఫిర్యాదుల కారణంగా ఆదాయపు పన్ను శాఖ అక్కడ రైడ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కాగా రాహుల్‌ గాంధీ పుదుచ్చేరి పర్యటన సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సంబంధించిన ఫ్యాక్టరీలో జరిగిన తనిఖీలు జరగడం చర్చనీయాంశంగా మారింది.

మామల్లపురం బీచ్‌లో అమ్మన్‌ విగ్రహం లభ్యం

అన్నానగర్‌: మామల్లపురం బీచ్‌లో 3 అడుగుల ఎత్తయిన అమ్మవారి విగ్రహం లభ్యమైంది. ఈ విషయంపై రెవెన్యూ శాఖ దర్యాప్తు చేస్తోంది. వివరాలు.. మామల్లపురం బీచ్‌లో ఆదివారం చాలా మంది పర్యాటకులు సముద్రంలో స్నా నం చేస్తుండగా, 3 అడుగుల ఎత్తైన అమ్మవారి విగ్రహం ఒకటి ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆ విగ్రహంలో సగం మట్టి కూరుకుపోయి ఉంది. 200 కిలోల బరువున్న ఈ అమ్మవారి విగ్రహం ఒక పీఠం పై కూర్చుని, తన నాలుగు చేతులలో కుడి, ఎడమ వైపులా వరుసగా ఈటె, బాకు, కత్తి, గదను పట్టుకుని ఉన్నట్లుగా కనిపిస్తుంది. కొందరు వీధి వ్యాపారులు ఒడ్డుకు కొట్టుకొచ్చిన దేవతా విగ్రహం గురించి మామల్లపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మట్టిలో కూరుకుపోయిన దేవతా విగ్రహాన్ని తవ్వి తీసి, ప్రతిష్టించారు. విగ్రహాన్ని తీసి విచారణ జరపాలని పోలీసులు రెవెన్యూ శాఖకు తెలియజేశారు. తిరుక్కలకుండ్రం తహసీల్దార్‌ దేవేంద్రన్‌ ఆదేశాల మేరకు, మామల్లపురం రెవెన్యూ అధికారి పుష్పరాజ్‌, అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

తిరుత్తణి నియోజకవర్గంలో 32 మంది నామినేషన్‌

తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్‌ దాఖలకు చివరి రోజు పూర్తి కావడంతో తిరుత్తణి నియోజకవర్గంలో 32 మంది నామినేషన్‌ దాఖలు చేశారు.రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 23న పోలింగ్‌ జరుగనుంది. దీంతో నామినేషన్ల పర్వం మార్చి 30న ప్రారంభమై సోమవారం పూర్త య్యింది. తిరుత్తణి నియోజకవర్గంలో చివరిరోజు అన్నాడీఎంకే అభ్యర్ధి హరి, డీఎండీకే అభ్యర్ధి కృష్ణమూర్తి సహా 14 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా 32 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు కోసం అన్నాడీఎంకే అభ్యర్ధి హరి అన్నాడీఎంకే కూటమి నేతలతో కలిసి రెండు వేలకు పైబడిన శ్రేణులతో భారీ ర్యాలీగా తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయంకు చేరుకుని అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే డీఎంకే కూటమి డీఎండీకే అభ్యర్ధి కృష్ణమూర్తి మున్సిపల్‌ కార్యాలయం నుంచి డీఎంకే కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి రెండు వేల మందికి పైబడిన కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట డీఎంకే జిల్లా కార్యదర్శి చంద్రన్‌, మాజీ జిల్లా కార్యదర్శి భూపతి సహా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

తిరువొత్తియూరు

కోర్టుకు బాంబు బెదిరింపు

తిరువొత్తియూరు: చైన్నె రాజాక్కాడై ప్రాంతంలో క్రిమినల్‌ న్యాయస్థానం ఉంది. సోమవారం ఉదయం యధావిధిగా కోర్టు కార్యకలాపాలు జరుగుతున్న క్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కోర్టులో బాంబు పెట్టామని కోర్టు ఈ–మెయిల్‌కు బెదిరింపు సమాచారం వచ్చింది. విషయం తెలుసుకున్న కోర్టులో ఉన్న వారంతా బయటకు వచ్చారు. తిరువొత్తియూరు పోలీసులు , బాంబు స్క్వాడ్‌ నిపుణులు అక్కడికి చేరుకుని స్నిఫర్‌ డాగ్‌ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. అక్కడ బాంబు లేదని తెలిసింది. దీంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement