పళ్లిపట్టు : వఠారన్నేశ్వరర్ ఆలయ కమల రథోత్సవం కోలాహలంగా సాగింది. వేలాదిగా భక్తులు పాల్గొని రథం లాగి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుత్తణి సమీపంలోని తిరువలంగాడు వఠారన్నేశ్వరర్ ఆలయంలో పంగుణి బ్రహ్మోత్సవాలు 22న ప్రారంభమై ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా ఉత్సవర్లు సోమాస్కందర్ వాహనాల్లో కొలువుదీరి భక్తులకు కటాక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన శనివారం కమల రథోత్సవం కోలాహలంగా సాగింది. వివిధ పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన రథంపై వండార్కుయళి సమేత ఉత్సవర్లు సోమస్కందర్ విశేష అలంకరణలో కొలువుదీరారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి రథం లాగారు. భక్తులు కర్పూర హారతులిచ్చి, కొబ్బరికాయలు కొట్టి స్వామి దర్శనం చేసుఉకున్నారు. రథోత్సవంలో భక్తులు దేవతామూర్తుల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ మాడ వీధుల్లో రథ ఊరేగింది. పలు చోట్ల భక్తులకు మజ్జిగ పంపిణీ చేసి అన్నదానం చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుత్తణి ఆలయ అధికారులు వేడుకల ఏర్పాట్లు చేశారు.
పుష్పాలంకరణలో వఠారన్నేశ్వరర్
రథాన్ని లాగుతున్న భక్తులు


