5లోపు మార్గదర్శకాలు ప్రకటించండి
సాక్షి, చైన్నె : రాజకీయ పక్షాల రోడ్షోలు, బహిరంగ సభలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను జనవరి 5వ తేదీలోపు ప్రకటించాలని ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈ మార్గదర్శకాలలో ఏదేని అభ్యంతరాలు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్లకు సూచించారు. సెప్టెంబర్ 27న కరూర్ వేదికగా తమిళగ వెట్రి కళగం నేత విజయ్ నిర్వహించిన ప్రచారం పెను విషాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఎక్కడికక్కడ ప్రచారసభలు, రోడ్షోల నిర్వహణకు చెక్ పెడుతూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి మార్గదర్శకాలు రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. కోర్టు నిర్దేశించిన నియమాలను అనుసరించే విధంగా తమిళనాడులో బహిరంగ సమావేశాలు, ర్యాలీలు ఇతర కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. అక్షిలపక్షంతో చర్చించి కఠిన ఆంక్షలు, షరతులు విధించారు. గుర్తింపు, ఎంపిక చేసిన ప్రదేశంలోనే సభలు, సమావేశాలు నిర్వహణకు అనుమతి ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. అనుమతుల కోసం 15 రోజులు లేదా 10 రోజులకు ముందే దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు చేపట్టారు. అలాగే, సభకు వచ్చే జనం సంఖ్యను బట్టి డిపాజిట్ మొత్తాన్ని నిర్ణయించారు. అత్యవసర వైద్యసేవలు, అంబులెన్స్ సేవలు, రద్దీని క్రమబద్ధీకరణ అన్ని ఏర్పాట్లు ఆయా పార్టీలదే బాధ్యతగా తీర్మానించారు. ఈ మార్గదర్శకాలను కోర్టుకు సమర్పించారు. దీనిపై వాదనలు, సూచలు, అభిప్రాయాల సేకరణ ముగిసింది. శుక్రవారం కోర్టు ఈ వ్యవహారంలో ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్షో ఇతర మార్గ దర్శకాలను జనవరి 5వ తేదీలోపు ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో ఏదేని అభ్యంతరాలు ఉంటే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించ వచ్చని సూచించింది.


