నిస్వార్థ సేవకులు..
పారిశుధ్య కార్మికులు నిస్వార్థ సేవకులు
సీఎం స్టాలిన్ వ్యాఖ్య
చైన్నెలో పారిశుధ్య కార్మికులకు ఆహార పథకం అమలు
డిసెంబరు 6 నుంచి అన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు విస్తరణ
ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ రోజూ ఉదయం చైన్నె పరిశుభ్రంగా ఉందంటే , రాత్రులలో పారిశుధ్య కార్మికులు పడే శ్రమే కారణం అని కితాబు ఇచ్చారు. ఎండ, వాన, వరదలు, తుపాన్లు, విపత్కర పరిస్థితులలో వీరి కృషికి అభినందనలు అనికొనియాడారు. తాను చైన్నె నగర మేయర్గా ఒకప్పుడు బాధ్యతలు స్వీకరించినప్పుడు ఇది ఒక పదవి కాదు..ఒక బాధ్య అని దివంగత నేత కరుణానిధి అన్న మాటలు ఈ సమయంలో గర్తుచేసుకుంటున్నట్లు వెల్లడించారు. రోజంతా బిజీగా ఉండే చైన్నెలో అవిశ్రాంతంగా, అంకితభావంతో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవా స్ఫూర్తి రాత్రిపూట ప్రయాణించే వారికి మాత్రమే తెలుస్తుందన్నారు. 30 సంవత్సరాల క్రితం మేయర్గా బాధ్యతలు స్వీకరించినప్పుడే ఈ నగరాన్ని క్లీన్సిటీగా మార్చాలన్న సంకల్పంతో నేటి వరకు అనేక కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నామని వివరించారు. ఈ మార్పులో మొదటి అడుగు ఈ నగరాన్ని శుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికుల జీవనప్రమాణాలు పెంచడం, ప్రయోజనకర కార్యక్రమాలు విస్తృతం చేయడం, సామాజిక న్యాయం ప్రయాణంలో ఆత్మ గౌరవాన్ని పరిరక్షించడమే కాకుండా, ఆకలిని తీర్చే పథకం అమల్లోకి వచ్చిందన్నారు. రాత్రింబవళ్లు పనిచేసే ఈ కార్మికుల కోసం గ్రేటర్ చైన్నె కార్పొరేషన్లోని 200 వార్డులలో మరుగుదొడ్డి సౌకర్యంతో కూడిన డ్రెస్సింగ్ రూమ్, విశ్రాంతి గదినిర్మించి త్వరలో ఉపయోగంలోకి తీసుకు వస్తామని ప్రకటించారు. ఈ ఆహార పథకం డిసెంబరు 6 నుంచి అన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు విస్తరిస్తామన్నారు.
సాక్షి, చైన్నె: పారిశుధ్య కార్మికుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ సీఎం స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం వివిధ పథకాల అమలుకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈఏడాది ఆగస్టు 14వ తేదీన పారిశుధ్య కార్మికుల కోసం ఆరు వరాలను సీఎం ప్రకటించారు. ఈ హామీ మేరకు కలైవానర్ అరంగం వేదికగా జరిగిన కార్యక్రమంలో సీఎం ఎంకే స్టాలిన్ చేతుల మీదుగా పారిశుధ్యకార్మికులకు ఆహార పథకం అమలుకు చర్యలు తాజాగా చర్యలు తీసుకున్నారు.అలాగే, నివాస గృహాల కేటాయింపుతో పాటూ వివిధ సంక్షేమ పథకాల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
ముఖ్యమంత్రి ఆహార పథకం..
గ్రేటర్ చైన్నె కార్పొరేషన్లో ఉదయం, మధ్యాహ్నం , రాత్రి వేళలో మూడు షిఫ్టులుగా సాగుతున్న క్లీనింగ్ పనులలో నిమగ్నమైన పారిశుధ్య కార్మికులకు సీఎం ఆహార పథకం అమలులోకి తీసుకొచ్చారు. ఆహారం బాక్సుల ద్వారా పనిచేసే చోటకే తీసుకెళ్లి అందించే విధంగా వాహనాలకు సీఎం స్టాలిన్ జెండా ఊపి ప్రారంభించారు. గ్రేటర్ చైన్నె కార్పొరేషన్లో, శాశ్వత , స్వయం సహాయక బృందం పారిశుధ్య కార్మికులు, ప్రైవేట్ పారిశుధ్య కార్మికులు, మలేరియా విభాగంలో ఉన్న కార్మికులు, ఇతర క్లీనింగ్ పనిలో ఉన్న పారిశుధ్య కార్మికులు, అర్బన్ హాబిటాట్ డెవలప్మెంట్ బోర్డు నివాస ప్రాంతాలలోని ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే వారు, ఉద్యోగులు, శ్మశానవాటిక శుభ్రపరిచే కార్మికులు, ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న పబ్లిక్ టాయిలెట్ శుభ్రపరిచే కార్మికులు, పార్కులు, ఆట స్థలాలలో పని చేయడం, రోడ్డుపై క్షేత్రస్థాయిలో పని చేస్తున్న వారు అంటూ మొత్తం 31,373 మందికి ఈ ఆహార పథకం అమలులోకి తీసుకొచ్చారు. ఇన్సులేటెడ్ థర్మల్ క్యారీయింగ్ బ్యాగుల్లో స్నాక్స్, స్టెయిన్లెస్ స్టీల్ టిఫిన్ బాక్సులతో ఆరోగ్యకరమైన ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే, గృహ నిర్మాణ పథకంలో భాగంగా 1000 మందికి కేటాయింపు ఉత్తర్వులను అందజేశారు. మరణించిన ఇద్దరు పారిశుధ్య కార్మికుల వారసులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు చొప్పున అందజేశారు. స్వయం ఉపాధి పొందుతున్న పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు, ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 25 మంది లబ్ధిదారులకు రూ. 46 లక్షలు, 1,260 మంది పారిశుధ్య కార్మికుల పిల్లలకు ఉన్న విద్యా స్కాలర్ షిప్, అన్ని రకాల ట్యూషన్ ఫీజులు, వసతి ఫీజులు, ఇతర ఖర్చుల కోసం రూ. 2.82 కోట్ల సహాయం అందజేశారు. పారిశుధ్య కార్మికుల కోసం థాట్కో ద్వారా 1,000 మంది లబ్ధిదారులకు రూ. 35 లక్షల గ్రాంట్ను అందజేశారు. అలాగే వైద్య సేవా పథకాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు కె.ఎన్. నెహ్రూ, అన్బరసన్, ఎం. సుబ్రమణియన్, పీకే శేఖర్బాబు, ఎం. మది వేందన్, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ మేయర్ ఆర్ ప్రియ, ఎంపీలు కళానిధి వీరాస్వామి, కనిమొళి సోము, శాసనసభ సభ్యులు తాయగం కవి, ఆర్.డి. శేఖర్, ఇ. పరంధామన్, వెట్రియాళగన్, జోసెఫ్ శామ్యూల్, సుదర్శనం, ప్రభాకరరాజా, డిప్యూటీ మేయర్ ఎం. మహేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, అదనపు ముఖ్య కార్యదర్శి కాకర్ల ఉష, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి డాక్టర్ కార్తికేయన్, మెట్రోపాలిటన్ చైన్నె కార్పొరేషన్ కమిషనర్ జె. కుమారగురుబరన్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కె లక్ష్మి పాల్గొన్నారు.
స్వీయ క్రమశిక్షణ అవసరం
మనదేశంలోనే..
భారతదేశంలోనే క్లీన్ సిటీగా చైన్నె , క్లీన్ స్టేట్గా తమిళనాడును తీర్చిద్దే ప్రయత్నం విస్తృతంచేద్దామన్నారు. ఈ సందర్బంగా జర్మనీ పర్యటనలో చూసిన శుభ్రత పరమైన అంశాలను గుర్తు చేస్తూ, పరిశుభ్రత ప్రమాణాలు పాటించడంలో స్వీయ క్రమశిక్షణ ప్రజలకు రావాలని పిలుపు నిచ్చారు. ప్రజలు కొంచెం ఆలోచించాలని పేర్కొంటూ, ఎక్కడ బడితే అక్కడ చెత్తను వేసి అపరిశుభ్ర వాతావరణాన్ని సృష్టించ వద్దని కోరారు. చెత్తను చెత్త బుట్టలోనే వేయాలని, రోజూ అనవసర వ్యర్థాలను పడేయాలని బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం మానుకోవాలని హితవు పలికారు. భవిష్యత్తులో, పాశ్చాత్య దేశాలు, జపాన్ వంటి ఇతర దేశాలలో లాగానే, అందరు ప్రజలు ఇక్కడ కూడా 100 శాతం స్వీయ క్రమశిక్షణను పాటించాలని పిలుపు నిచ్చారు. పారిశుధ్య కార్మికులు కూడా ఇతర ఉద్యోగులకు సమానం అని, వారికి గౌరవాన్ని అందరం ఇద్దామన్నారు. పారిశుధ్యకార్మికులు జీవన నాణ్యతను మెరుగుపరచడం, ఆరోగ్యాన్ని పరిరక్షించడం, వీరి పిల్లలు ఉన్నత చదువులతో ఉన్నత బాధ్యతలు చేపట్టాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గత సంవత్సరం తనకు తిరువారూర్ జిల్లాకు చెందిన దుర్గా అనే మహిళ నుంచి వచ్చిన సందేశాన్ని గుర్తు చేస్తూ, ఆమె కుమార్తె గ్రూప్ – 2 ఉత్తీర్ణత సాధించి మునిసిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారని, ఇలాంటి పురోగతినే తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో పారిశుధ్య కార్మికుల పిల్లలు అందరూ బాగా చదువుకుంటారని, ఉన్నత స్థానంలో అధికారులుగా బాధ్యతలు నిర్వర్థిస్తారని, వారికి తానే ఉద్యోగ నియామక ఉత్తర్వులు సైతం అందజేస్తానని వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలని, పారిశుధ్య కార్మికులు నిస్వార్థ సేవలను అభినందిద్దామని పిలుపు నిచ్చారు.
నిస్వార్థ సేవకులు..
నిస్వార్థ సేవకులు..


